పేదరికం, నిరుద్యోగం పెంచారు | GST, demonetisation ruined economy | Sakshi
Sakshi News home page

పేదరికం, నిరుద్యోగం పెంచారు

Nov 29 2018 5:11 AM | Updated on Nov 29 2018 8:23 AM

GST, demonetisation ruined economy - Sakshi

నిర్మల్‌ సభకు హాజరైన ప్రజలు.. మాట్లాడుతున్న మాయావతి

నిర్మల్‌: ఏళ్లపాటు దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్, బీజేపీలు పేదరికం, నిరుద్యోగాన్ని మరింత పెంచాయని, బహుజనుల అభివృద్ధి విస్మరించాయని బీఎస్పీ జాతీ య అధ్యక్షురాలు మాయావతి ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్‌ జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల ను ఆయా పార్టీలు విస్మరించాయని విమర్శించారు. తప్పుడు ఆర్థిక విధానాలతో పేదరికం, నిరుద్యోగం పెరిగిందన్నారు. సామాన్యుడిని ఇబ్బంది పెట్టేలా డీజిల్, పెట్రోల్‌ ధరలను పెంచారన్నారు.

నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలతో ప్రజలను ఇబ్బందుల పాలు చేశారని మండిపడ్డారు. దేశంలో రోజురోజుకు అవినీతి పెరుగుతోందని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ప్రతీ కుటుంబానికి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు ఇస్తామని 2014 ముందు ఎన్నికల్లో నరేంద్రమోదీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఐదేళ్లు పూర్తి కావస్తున్నా కుటుంబానికి ఒక రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణలోనూ ధన బలంతోనే పార్టీలు అధికారంలోకి వస్తున్నాయన్నా రు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బహుజను ల బాగోగులను పట్టించుకోవడంలో విఫ లమయ్యాయని ధ్వజమెత్తారు.

ఓబీసీ రిజర్వేషన్ల అమలు ఘనత తమదేనన్నారు. మైనార్టీల స్థితిగతులపై సచార్‌ కమిటీ ప్రతిపాదనలను అమలు చేయడం లేదని ఆరోపించారు. దేశవ్యాప్తంగా బడుగు, బలహీన, మైనార్టీలతో పాటు అగ్రకులాల్లోని పేదలకూ రిజర్వేషన్లు పెంచేందుకు బీఎస్పీ పోరాడుతుందని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో నాలుగుసార్లు గెలుపొందిన బీఎస్పీ ‘సర్వజన హితాయ.. సర్వజన సుఖాయ’సూత్రంతో అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేసిందన్నారు. ఇప్పుడు తెలంగాణలోనూ అన్ని వర్గాల అభ్యున్నతి కోసం బీఎస్పీ ఒంటరిగా పోరాటం చేస్తుం దని చెప్పారు. ఈసారి తమకు రాష్ట్ర ప్రజ లు అవకాశం ఇచ్చి చూడాలని కోరారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ సభకు చుట్టూ పక్కల అన్ని నియోజకవర్గాల నుంచి బీఎస్పీ అభ్యర్థులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement