చంద్రబాబూ..భాష మార్చుకో..
ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు తప్పుబట్టారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలి పెట్టిన సీఎం పై టీడీపీ ఎమ్మెల్యేలు కూడా తప్పుడు ఆరోపణలు చేయటం తగదన్నారు. టీడీపీ సభ్యుల పట్ల మార్షల్స్ మర్యాద పూర్వకంగానే వ్యవహరించారని, అయినా గాని సీఎం జగన్పై ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో చంద్రబాబు అనుచిత ప్రవర్తనపై వీడియో కూడా ప్రదర్శించామని చెప్పారు. సభలో కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టే సమయంలో టీడీపీ సభ్యులు ఈ విధంగా వ్యవహరించటం సరైన పద్దతి కాదన్నారు. బిల్లులకు ఆటంకం కలిగించాలనే దురుద్దేశంతోనే ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.