మూడు, నాలుగు రోజుల్లో ప్రభుత్వ నిర్ణయం: బొత్స

GN Rao Comittee: AP Cabinet To Key Decision Taken On Dec 27 - Sakshi

సాక్షి, విశాఖ : ఈ నెల 27న జరిగే మంత్రివర్గ సమావేశంలో జీఎన్‌ రావు కమిటీ నివేదికపై చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆయన ఆదివారమిక్కడ మాట్లాడుతూ.. ముంబై తర్వాత విశాఖ అభివృద్ధి చెందే నగరమని కమిటీ గుర్తించిందన్నారు. రాష్ట్ర నైసర్గిక స్వరూపంతో పాటు ఆయా ప్రాంతాల్లో వనరులు వంటి అంశాలతో నివేదికను రూపొందించిందన్నారు. మూడు నాలుగు రోజుల్లో ప్రభుత్వ నిర్ణయం వెలువడుతుందన్నారు. మాటలు చెబుతూ, గ్రాఫిక్స్‌ చూపిస్తే పెట్టుబడులు రావని అన్నారు. 

రాష్ట్రంలోపెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో సంస్థలు ముందుకు వస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ నెల 28న విశాఖలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేస్తారని తెలిపారు.  మౌలిక వసతుల ఏర్పాటుకు సుమారు వెయ్యి కోట్ల విలువ చేసే పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని తెలిపారు. త్వరలో మెట్రో రైలుకు శంకుస్థాపన జరుగుతుందన్నారు. అలాగే రెండు నెలల కాలంలో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేయడానికి సీఎం కృత నిశ్చయంతో ఉన్నారని మంత్రి బొత్స తెలిపారు. 

‘రాష్ట్ర అభివృద్ధి, రాజధానులపై నిపుణుల కమిటీ వెయ్యి పేజీల నివేదిక ఇచ్చింది. ఈ నెల 27న కమిటీ నివేదికపై మంత్రిమండలి చర్చిస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వస్తుంది. అమరావతిలో చట్టసభలను కొనసాగించమని కమిటీ సూచించింది. ల్యాండ్‌ పూలింగ్‌లో భూములు ఇచ్చిన రైతులకు నష్టం జరగనివ్వం. అభివృద్ధి చేసిన ప్లాట్లు కేటాయిస్తాం. అమరావతిలో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌పై ఆధారాలతో సహా బయటపెట్టాం. విశాఖలో భూములకు సంబంధించి మాపై ఆధారాలు ఉంటే పేర్లతో సహా బయటపెట్టండి. అనధికార లే అవుట్లకు అనుమతి ఇస్తే అధికారులపై కఠినంగా వ్యవహరిస్తాం. త‍్వరలోనే దీనిపై ప్రభుత్వ విధివిధానాలు రూపొందించి విడుదల చేస్తాం’ అని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top