జగన్‌ మొదటి బడ్జెట్‌.. మనసున్న బడ్జెట్‌ | Discussion on Fiscal Appropriation Bill in AP Assembly | Sakshi
Sakshi News home page

జగన్‌ మొదటి బడ్జెట్‌.. మనస్సున్న బడ్జెట్‌

Jul 29 2019 12:55 PM | Updated on Jul 29 2019 1:39 PM

Discussion on Fiscal Appropriation Bill in AP Assembly - Sakshi

సాక్షి, అమరావతి: ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ కొనసాగుతోంది. ఈ చర్చలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్‌ను మనస్సున్న బడ్జెట్‌గా అభివర్ణించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని సీఎం వైఎస్‌ జగన్‌ నిలబెట్టుకుంటున్నారని కొనియాడారు. ప్రజా సమస్యలను గమనించి.. వాటి పరిష్కారానికి అనుగుణంగా బడ్జెట్‌లో నిధులు కేటాయించారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ శూన్యమని, చంద్రబాబు హయాంలో భూకుంభకోణాలు, కాల్‌మనీ సెక్స్‌ రాకెట్లు వంటి దుర్మార్గాలు జరిగాయని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని తిరస్కరిస్తూ ప్రజలు గట్టిగా తీర్పు ఇచ్చినా.. ఆయనలో ప్రశ్చాత్తాపం కనిపించడం లేదని అన్నారు. చంద్రబాబు సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లలో సంక్షేమం సున్నా అని, సీఎంగా బాబు పెట్టిన మొదటి సంతకాన్ని కూడా అమలు చేయలేదని అన్నారు. అభివృద్ధి,సంక్షేమానికి కేరాఫ్‌ దివంగత మహానేత వైఎస్సార్‌ అని గుర్తు చేశారు.

బాబు తన ఇంటికే ఉద్యోగం ఇచ్చుకున్నారు
పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకు కల్పిస్తూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని కాకాణి గోవర్థన్‌రెడ్డి కొనియాడారు. ఇంటికో ఉద్యోగం కల్పిస్తానని నిరుద్యోగులను మభ్యపెట్టిన చంద్రబాబు తన హయాంలో తన ఇంటికి మాత్రమే ఉద్యోగం కల్పించారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులకు భృతి కల్పిస్తానని చెప్పి.. ఎన్నికలకు కొన్ని నెలల ముందు హామీ చేసి మోసం చేయాలని చూశారని మండిపడ్డారు. గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఐదు సంతకాలు చేశారని, కానీ అవి అమలుకు నోచుకోలేదన్నారు. దివంగత మహానేత వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేశారని, తన తుదిశ్వాస విడిచేవరకు రైతులకు ఉచిత విద్యుత్‌ అందించిన ఘనత వైఎస్సార్‌ది అని కొనియాడరు. రైతును రాజును చేసిన ఘనత వైఎస్సార్‌ది అన్నారు. రైతుల సంక్షేమం విషయంలో వైఎస్సార్‌ విధానాలను సీఎం జగన్‌ కొనసాగిస్తున్నారని అన్నారు. వ్యవసాయం గురించి ఆలోచించి చరిత్రలో నిలిచిపోయారు కనుకే వైఎస్సార్‌ జయంతి నాడు రైతుదినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. 

వైఎస్సార్‌ రైతు భరోసా పథకం ఈ ఏడాది అక్టోబర్‌ 15 నుంచి అమలు చేయబోతున్నామని, రూ. 12,500 చొప్పున నాలుగు దశల్లో రూ. 50వేల రైతులకు అందజేస్తామని తెలిపారు. ఈ పథకం అమలు కోసం మొట్టమొదటిబడ్జెట్‌లోనే నిధులు కేటాయించారని తెలిపారు. కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేసినట్టు తెలిపారు. అమలు సాధ్యం కాదని తెలిసినా రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులను మోసం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు తరహాలో రుణమాఫీ హామీ ఇచ్చి.. మోసపూరితంగా అధికారంలోకి రావాలని వైఎస్‌ జగన్‌ 2014 ఎన్నికల్లో భావించలేదని, ఆచరణకుసాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి రావాలనుకోవడం లేదని, ఈ విషయంలో ప్రతిపక్షంలో కూర్చోవడానికైనా సిద్ధమేనని అన్నారని, అలా ప్రతిపక్షంలో ఉండి.. ప్రజల మెప్పుతో వైఎస్‌ జగన్‌ మళ్లీ అధికారంలోకి వచ్చారని తెలిపారు. వైఎస్సార్‌ రైతు భరోసా పథకంతోపాటు రైతులకు వడ్డీలేని రుణాలు, వ్యవసాయానికి పగటి పూట తొమ్మిది గంటల ఉచిత విద్యుత్‌, వైఎస్సార్‌ పంటల బీమ పథకం, ఆక్వా రైతులకు రూ.1.50 యూనిట్‌ విద్యుత్‌ తదితర రైతు సంక్షేమ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement