
శివరాజ్సింగ్ చౌహాన్ (ఫైల్ఫోటో)
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రైతులను రెచ్చగొట్టి గొడవలు సృష్టించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. మంద్సోర్లో రైతులు మరణించి ఏడాది గడిచిన సందర్భంగా ఈ నెల ఆరున కాంగ్రెస్ పార్టీ కిసాన్ ఆందోళన్ ర్యాలీని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ర్యాలీ పై స్పందించిన సీఎం కాంగ్రెస్ నేతలు శవరాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
తమ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని, గత పదిహేనేళ్లగా రైతుల అభివృద్ది కోసం కృషి చేస్తున్నట్లు సీఎం తెలిపారు. దేశవ్యాప్తంగా రైతుల సమ్మెపై వ్యవసాయశాఖ మంత్రి భూపేంద్రసింగ్ స్పందించారు. పాలు,కూరగాయలు పట్టణాలకు రాకుండా అడ్డుకుంటున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పంటలకు మద్దతు ధర, స్వామినాధన్ కమిషన్ సిపారస్సులు అమలు చేయాలని దేశవ్యాప్తంగా రైతులు పదిరోజుల నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే.