చంద్రబాబు ఇంకా ఆ భ్రమలోనే ఉన్నారు..

Chandrababu Takes Another U Turn says Vijayasai Reddy - Sakshi

సాక్షి, అమరావతి: ఎన్నికల షాక్‌ నుంచి తేరుకోకముందే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరో యూ-టర్న్‌ తీసుకున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. ‘ఇకపై ఆయన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని యూపీఏలో కొనసాగరట. అలాగే కేంద్రంపై పోరాటాలకు విరామం ఇస్తారట. అర్థమవుతోంది కదా....నరేంద్ర మోదీ, అమిత్‌ షాకు మోకరిల్లే ప్రయత్నం అని. ముగ్గురు ఎంపీలతో ఆయన ఎన్ని యూ-టర్న్‌లు తీసుకున్నా పట్టించుకునేవారు ఉండరు.’ అని విజయసాయి రెడ్డి ట్విట్‌ చేశారు.

ఇక గన్నవరం విమానాశ్రయంలో నిబంధనల మేరకు చంద్రబాబుకు భద్రతా తనిఖీలు నిర్వహించడంపై టీడీపీ రాద్ధాంతం చేస్తోందంటూ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్ష పార్టీ తమ నాయకుడి సౌకర్యాలు, ఇబ్బందుల గురించి ఆందోళనకు దిగడం సిగ్గుచేటని, విమానాశ్రయ భద్రతా నిబంధనలు ఎవరైనా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజలు ఛీకొట్టిన తర్వాత కూడా ఇంకా సీఎంగానే కొనసాగుతున్నట్టు ఆయన భ్రమపడటం, మీరు భజన చేయడం ఎబ్బెట్టుగా లేదూ? అంటూ సూటిగా ప్రశ్నించారు.

సీఎంగా ఉన్నప్పటి ప్రభుత్వ మర్యాదలు, మినహాయింపులు ఇంకా కొనసాగాలని చంద్రబాబు ఆశిస్తున్నారని, ఎన్నికల్లో ఆయనకు వాతలు పెట్టిన ప్రజలకు ఇవన్నీ ప్రాముఖ్యత లేని అంశాలుగా కనిపిస్తున్నాయన్నారు. వెన్నుపోటు, నయవంచన, అక్రమాలతో సీఎం అయిన చంద్రబాబు 14 ఏళ్ళపాటు తన కుటుంబం, తన వాళ్ళ  కోసమే పనిచేశారని ధ్వజమెత్తారు. ఆయనేదో స్వాతంత్రం కోసం పోరాడిన యోధుడైనట్లుగా కొందరు ఉన్మాదులు ఊగిపోవడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. చంద్రబాబే అందరినీ అవమానాల పాల్జేశారని, హేళనగా చూశారని విజయసాయి రెడ్డి అన్నారు. యువ ముఖ్యమంత్రి తమ పట్ల కనబరుస్తున్న శ్రద్ధ, తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర ప్రజల్లో కొత్త ఆశలు నింపాయని ఆయన పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top