ఇసుక బకాసురుల్లా టీడీపీ ఎమ్మెల్యేలు

BJP Leaders Somu Veerraju And Vishnu Kumar Slams Chandrababu In Amaravati - Sakshi

అమరావతి: రాష్ట్రంలో ఇసుక మాఫియా రాక్షసంగా తయారయిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ ఎమ్మెల్యేలు బకాసురుల్లా ఇసుకను తినేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు సైతం ఈ కుంభకోణంలో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. పేదవాళ్లకు ఇసుక అందకుండా చేస్తున్నారని విమర్శించారు. ఉచిత ఇసుక పాలసీ రాష్ట్రంలో అమలు కావడం లేదని పేర్కొన్నారు. ఏపీలో నీతిలేని పరిపాలన నడుస్తోందని, వచ్చే ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేయడం కోసమే ఇసుకను టీడీపీ ఆదాయవనరుగా మార్చుకుందని ధ్వజమెత్తారు.

బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు మాట్లాడుతూ..టీడీపీ, బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నప్పుడు కూడా ఇసుక మాఫియాను వ్యతిరేకించానని తెలిపారు. సీఎంకు చేతకాకపోతే నాకు అధికారం ఇవ్వండి..నెల రోజుల్లో ఇసుక మాఫియాను అరికడతామని సవాల్‌ విసిరారు. రోజురోజుకీ ఇసుక మాఫియా అరాచకాలు పెరిగిపోతున్నాయని చెప్పారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సభకు రావడం లేదని వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హులుగా ప్రకటించండని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అడగటంలో న్యాయముందని చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top