‘వినతి పత్రం ఇవ్వబోతే అరెస్టులా?’
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామిని తెలంగాణ ప్రభుత్వం నగర బహిష్కణ చేయడంపై బీజేపీ శ్రేణులు మంగళవారం చేపట్టిన ‘ఛలో ప్రగతిభవన్’ ఆందోళనలో పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యేలు జి.కిషన్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, సీనియర్ నాయకుడు బద్దం బాల్రెడ్డిని అరెస్టు చేసి ఠాణాలకు తరలించారు.
సీఎం కేసీఆర్ను కలిసి వినతి పత్రం అందిద్దామని బయల్దేరిన నేతలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు వ్యాఖ్యానించారు. అరెస్టులతో తెలంగాణలో ప్రజాస్వామ్య విలువలు పతనమవుతున్నాయని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు సమయం ఇవ్వకపోగా ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం కేసీఆర్ నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. తెలంగాణలో సాగుతున్నది ప్రజాస్వామ్య పాలనా లేక నిజాం నిరంకుశ పాలనా అని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విటర్లో తెలంగాణ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు.
తెలంగాణా లో బీజేపీ నాయకుల అక్రమ అరెస్ట్, మంటగలుస్తున్న ప్రజాస్వామ్య విలువలు, ఎమ్మెల్యేలకు కూడా కేసీఆర్ సమయం ఇవ్వరు, కలుద్దామని వచ్చే వారిని అరెస్టు చేస్తారు.. తెలంగాణా లో సాగుతున్నది ప్రజాస్వామ్య పాలనా లేక నిజాం నిరంకుశ పరిపాలననా?
— P Muralidhar Rao (@PMuralidharRao) July 17, 2018
మరిన్ని వార్తలు