కేజ్రీవాల్‌కు మద్దతుగా మాయా, అఖిలేష్‌

Akhilesh And Mayawati Supports To Arvind Kejriwal In Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో కూటమిగా పోటీచేస్తున్న ఎస్పీ-బీఎస్పీ పార్టీలు జాతీయ స్థాయిలో కూడా తమ ఓటు బ్యాంక్‌ను చీలకుండా పథకాలు రచిస్తున్నాయి. కొన్ని స్థానాల్లో సొంతంగా పోటీ చేస్తూ.. మరికొన్ని చోట్ల భావసారూప్యత కలిగిన పార్టీలకు  మద్దతిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని ఢిల్లీలో రెండు చోట్ల  అరవింద్‌ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్‌ఆద్మీ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించాయి. మిగతా స్థానాల్లో బీఎస్పీకి తాము మద్దతు ఇవ్వనున్నట్టు సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఆదేశాల మేరకు తాము బీఎస్పీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నట్టు ఎస్పీ ఢిల్లీ  అధికార ప్రతినిధి ఆర్ఎస్ యాదవ్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కూటమి విజయం కోసం ఉమ్మడిగా పనిచేస్తామని తెలిపారు. 
 
న్యూఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ స్థానాల్లో మేము ఆప్‌ అభ్యర్థులకు మద్దతు ఇస్తామని యాదవ్‌ తెలిపారు. అక్కడ బీఎస్పీ అభ్యర్థులను పోటీలో ఉంచకూడదని ఆ పార్టీ నిర్ణయించినందున ఆప్‌ గెలుపుకోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. బీఎస్పీ తరపున సంజయ్ గెహ్లాట్ (ఈస్ట్ ఢిల్లీ), రాజ్‌వీర్ సింగ్ (నార్త్ ఈస్ట్ ఢిల్లీ), సీతా శరణ్ (వెస్ట్ ఢిల్లీ), షాహీద్ అలీ (చాందినీ చౌక్), సిద్ధాంత గౌతమ్ (సౌత్ ఢిల్లీ) పోటీచేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆప్‌, కాంగ్రెస్‌ మధ్య పొత్తు ఉంటుందని మొదటి నుంచి వార్తలు వినిపించినా.. చివరుకు రెండు పార్టీలు ఒంటరిగానే బరిలో నిలవాలని నిర్ణయించాయి. విపక్షాలు విడివిడిగా పోటీకి దిగడంతో విజయంపై బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top