
సాక్షి,న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల మలివిడత ప్రచారానికి తెరపడిన క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి సెంటిమెంట్ అస్ర్తాన్ని ప్రయోగించారు.తనపై ప్రతిపక్షాలు సాగిస్తున్న అసత్య ప్రచారంతో గుజరాతీల మనసులు గాయపడ్డాయని వ్యాఖ్యానించారు. గుజరాత్, భారత్ల అభివృద్ధికి తన జీవితం అంకితమైందని స్పష్టం చేశారు.‘గుజరాత్ ఎన్నికల ప్రచారం ముగిసింది..గత మూడున్నరేళ్లుగా గుజరాత్ అంతటా విస్తృతంగా పర్యటించిన తనకు ప్రజల ఆశీస్సులు మెండుగా లభించాయని, గుజరాతీలు తన పట్ల కనబరిచిన ప్రేమ ఆప్యాయతలు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో మరిచిపోలేని*వని అన్నారు.
రాష్ర్ట అభివృద్ధి పట్ల, తన పట్ల విపక్షాలు సాగిస్తున్న విష ప్రచారాన్ని దీటుగా తిప్పికొట్టేందుకు ప్రతి పోలింగ్ బూత్లో బీజేపీ విజయానికి సహకరించాలని కోరుతూ ప్రధాని ట్వీట్ చేశారు. ఈనెల 14న జరగనున్న తుదివిడత పోలింగ్కు ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. 14 జిల్లాల్లోని 93 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్ జరగనుంది.