పురుడు పోసిన మహిళా పోలీసు

Women SI Helps To Pregnant Women In Tamilnadu - Sakshi

పురిటి నొప్పులతో నడిరోడ్డుపై తల్లడిల్లిన మహిళ

గస్తీలో ఉండగా గర్భిణిని చూసిన మహిళా ఇన్‌స్పెక్టర్‌

అత్యవసరంగా నడిరోడ్డుపైనే పురుడు

సాక్షి, చెన్నై: పురిటి నొప్పులతో తల్లడిల్లిన మహిళకు నడిరోడ్డుపై ప్రసవం చేసి న్యాయ రక్షణకే కాదు, ప్రాణ రక్షణకు తాము ముందుం టామని నిరూపించింది ఓ మహిళా ఇన్‌స్పెక్టర్‌. వివరాల్లోకి వెళితే.. చూలైమేడు సౌరాష్ట్రానగర్‌ ఎనిమిదవ వీధికి చెందిన మహిళ భానుమతి నిండు గర్భిణి. ఈమె భర్త రాత్రి పనికి వెళ్లాడు. ఇంటిలో భానుమతి మాత్రమే ఒం టరిగా ఉన్నది. ఈ స్థితిలో శుక్రవారం రాత్రి 2.45 గంటలకు భానుమతికి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో నొప్పులు తట్టుకోలేక ఆమె ఆటో ఎక్కి ఆస్పత్రికి వెళ్లాలని రోడ్డుపైకి వచ్చింది. అయితే ఒక్క ఆటో కూడా రాకపోగా నొప్పులు అధికంగా కావడంతో భానుమతి చూలైమేడు హైవే రోడ్డుపై పడుకొని తల్లడిల్లింది. అదే సమయంలో రాత్రి గస్తీ పనుల్లో ఉన్న చూలైమేడు నేరవిభాగ ఇన్‌స్పెక్టర్‌ చిత్ర భానుమతిని గమనించి వాహనం ఆపింది. తర్వాత భానుమతిని తన జీప్‌లో ఎక్కించి ఆస్పత్రికి తీసుకుని వెళ్లాలని భావించింది. అయితే భానుమతికి అధికంగా రక్తస్రా వం అవుతుండడంతో వాహనంలోకి ఎక్కించలేకపోయారు. వెంటనే తన వాహనాన్ని అడ్డుగాపెట్టి, సహాయకురాలు, అక్కడ పారిశుధ్ద్య పనుల్లో ఉన్న ఇద్దరు మహిళల సాయంతో భానుమతికి ప్రసవం చేశారు. కాన్పులో భానుమతికి పండంటి మగ బిడ్డ జన్మించా డు. తర్వాత 108 అంబులెన్స్‌ను రప్పించి తల్లిని, బిడ్డను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించా రు. ప్రస్తుతం ఆస్పత్రిలో తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఇన్‌స్పెక్టర్‌ సాహసాన్ని కొనియాడుతూ స్థానికులు ఆమెను అభినందనల్లో ముంచెత్తుతున్నారు.

కాళ్లు, చేతులు వణికాయి..
భానుమతికి ప్రసవం చేసిన మహిళా ఇన్‌స్పెక్టర్‌ చిత్ర మాట్లాడుతూ.. ‘‘చూలైమేడు హైరోడ్డులో గస్తీ చేపట్టిన సమయంలో వేకువజామున 3 గంటకు రోడ్డుపై పురిటి నొప్పులతో మహిళ అల్లాడుతుండడాన్ని చూసి దిగ్భ్రాంతి చెందాను వెంటనే వాహనాన్ని నిలిపి దగ్గరకు వెళ్లి ఆ మహిళను ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించాను. అయితే అప్పటికే రక్తస్రావం అధికంగా ఉండడం వలన జీపు ఎక్కించే సమయంలోనే బిడ్డ బయటకు వచ్చే ప్రమాదం ఉండడంతో హుటాహుటిన ఆ మహిళపై ఉన్న దుప్పట్టాను మరుగుగా కప్పుకుని ప్రసవం చేశాను. ఆ సమయంలో నా చేతులు కాళ్లు వణికాయి. అయిప్పటికీ ధైర్యం తెచ్చుకుని బిడ్డను బయటకు తీశాను. సమీపంలో ఉన్న పారిశుద్ధ్య కార్మిక మహిళలు సాయంతో ప్రసవం విజ యవంతమైంది. బొడ్డు తాడు కోయడానికి నా జీప్‌లో ఉన్న చిన్న కత్తిని ఉపయోగించాను. ఇలా రెండు నిండు ప్రాణాలను కాపాడగలిగాను. కాగా ఇన్‌స్పెక్టర్‌ చిత్ర సొంత ఊరు వేలూరు సమీపంలోని కావేరిపాక్కం. ఆమె భర్త బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థలో అధి కారిగా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి అరవింద్, సింధుజా అనే పిల్లలు ఉన్నారు. ఇన్‌స్పెక్టర్‌గా విధులు చేపట్టి రెండున్నర సంవత్సరాలు అవుతుండడం గమనార్హం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top