'బంగారు రింగులొస్తాయని ఊహించలేదు' | This Beggar in gujarat just spent all his money on Buying gold Earrings for Poor Girls | Sakshi
Sakshi News home page

'బంగారు రింగులొస్తాయని ఊహించలేదు'

Feb 6 2016 7:33 PM | Updated on Sep 3 2017 5:04 PM

పెద్ద మనసుండాలిగానీ పేద పిల్లలకు ఎవరైనా సాయం చేయవచ్చు. గుజరాత్‌లోని మెహసానా గ్రామానికి చెందిన ఖీంజీభాయ్ ప్రజాపతి అనే వృద్ధుడికి అలాంటి పెద్ద మనుసుంది.

గాంధీనగర్: పెద్ద మనసుండాలిగానీ పేద పిల్లలకు ఎవరైనా సాయం చేయవచ్చు. గుజరాత్‌లోని మెహసానా గ్రామానికి చెందిన ఖీంజీభాయ్ ప్రజాపతి అనే వృద్ధుడికి అలాంటి పెద్ద మనుసుంది. గ్రామంలోని పేద కుటుంబాలకు చెందిన బాలికల్లో చదువును ప్రోత్సహించేందుకు ఆ తాత ప్రతి ఏటా పాఠ్య పుస్తకాలను లేదా యూనిఫామ్స్‌ను దానం చేస్తున్నారు. గత పదేళ్లుగా ఆయన చేస్తున్న సాయం ఇదే. ఈసారి కూడా తాత పుస్తకాలు లేదా స్కూలు దుస్తులు తీసుకొస్తారని మంగళవారం నాడు పేద విద్యార్థులైన బాలికలు తమ ఇళ్ల ముందు ఎంతో ఉత్సాహంతో ఎదురు చూశారు.

కళ్లు కూడా సరిగ్గా కనపడని ఆ తాత రెండు  ఊత కర్రల సాయంతో కుంటుకుంటూ వారి వద్దకు వచ్చారు. తాత భుజానున్న సంచిలో బరువైన వస్తువులేవీ కనిపించక పోవడంతో పిల్లలంతా నిరుత్సాహపడ్డారు. దగ్గరికి వచ్చిన తాత పిల్లల మొఖాలను ఆప్యాయంగా నిమిరుతూ ‘ఈసారి మీకు కొత్త బహుమతులు తీసుకొచ్చాను’ అంటూ వాటిని చూపించగానే పిల్లలు ఎక్కడలేని ఆనందంతో తాత చుట్టు గంతులేశారు. ఆ పిల్లల తల్లులు కూడా తాతా ఉదారస్వభావానికి చలించి పోయారు. రెక్కాడితేగాని డొక్కాడని తమ బతుకుల్లో పిల్లలకు బంగారు రింగులొస్తాయని ఏనాడు ఊహించలేదంటూ కుముద్ లుహారియా అనే ఓ తల్లి కన్నీళ్లు పెట్టుకుంది.

ఈసారి తాత పిల్లలకు చిన్నసైజు బంగారు చెవి పోగులను తీసుకొచ్చారు. ఒక్కోదానికి 13వందల రూపాయలు ఖర్చు పెట్టారు. తాత లక్ష్యం గురించి తెల్సిన స్థానిక నగల దుకాణం యజమాని దీపక్ షా నగలపై మూడు వేల రూపాయలను తగ్గించారు. ఇంతకు తాత డబ్బున్న ధనరాజు కాదు. భిక్షాటనపై బతికే ఒంటరి జీవి. గ్రామంలోని గుళ్లూ గోపురాలే ఆయన ఆదాయ వనరులు. గత పదేళ్లలో పేద పిల్లల పుస్తకాలు, బడి బట్టల కోసం ఆయన 80 వేల రూపాయలకు పైగా ఖర్చు పెట్టారు.

తమ గ్రామంలో ఆడ పిల్లలు, ముఖ్యంగా పేదింటి పిల్లలు చదువులో బాగా వెనకబడ్డారని, వారు బాగా చదువుకొని తమ కాళ్లపై తాము నిలబడాలనేదే తన తాపత్రయమని ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ముందు తాత వ్యాఖ్యానించారు. ఆడ పిల్లల చదువుకోసమే తాను ఎక్కువ గంటలు భిక్షాటన చేస్తున్నానని, జీవించి ఉన్నంతకాలం తన లక్ష్యం ఇదేనంటూ ఆ తాత మీడియా ముందు నుంచి బిరబిర నడుచుకుంటూ భిక్షాటనకు బయల్దేరి వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement