మగన్‌లాల్ ఉరిపై సుప్రీం స్టే | Supreme Court stays execution of Maganlal | Sakshi
Sakshi News home page

మగన్‌లాల్ ఉరిపై సుప్రీం స్టే

Aug 9 2013 1:16 AM | Updated on Sep 2 2018 5:20 PM

కుటుంబ గొడవల కారణంగా తన ఐదుగురు కుమార్తెలను తలనరికి చంపిన ఓ వ్యక్తికి విధించిన ఉరిశిక్షను అమలుచేయడంపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

న్యూఢిల్లీ: కుటుంబ గొడవల కారణంగా తన ఐదుగురు కుమార్తెలను తలనరికి చంపిన ఓ వ్యక్తికి విధించిన ఉరిశిక్షను అమలుచేయడంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దేశంలో ఉరిశిక్షను రద్దు చేయాలంటూ వచ్చిన అభ్యర్థనలపై నిర్ణయం తీసుకొనేవరకూ ఈ స్టే కొనసాగనుంది. 2010 జూన్‌లో మధ్యప్రదేశ్‌లోని సెహోరా జిల్లాకు చెందిన మగన్‌లాల్ బరేలా అనే వ్యక్తి తన ఇద్దరు భార్యలతో గొడవ కారణంగా.. ఆరేళ్లలోపు వయసున్న తమ ఐదుగురు కుమార్తెలను తలనరికి చంపేశాడు. దీంతో సెహోర్ జిల్లా ట్రయల్ కోర్టు బరేలాకు ఉరిశిక్ష విధించింది. తర్వాత మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలన్న నిందితుడి పిటిషన్లను మధ్యప్రదేశ్ హైకోర్టు, సుప్రీంకోర్టు గతంలోనే కొట్టివేశాయి. బరేలాకు క్షమాభిక్ష పెట్టేందుకు రాష్ట్రపతి నిరాకరించారు. ఈ మేరకు జబల్‌పూర్ జైల్లో గురువారం ఉదయమే బరేలాకు ఉరిశిక్షను అమలుచేయాల్సి ఉంది.
 
 కానీ, దేశంలో ఉరిశిక్షలను రద్దు చేయడం కోసం పోరాడుతున్న ‘పీపుల్స్ యూనియన్ ఫర్ డెమొక్రటిక్ రైట్స్ (పీయూడీఆర్)’ సంస్థ సభ్యులు.. బుధవారం రాత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివంను ఆయన ఇంటివద్ద కలిసి బరేలా ఉరిశిక్ష అమలును వాయిదావేయాలని కోరారు. దీనిపై స్పందించిన సీజే ఉరిశిక్ష అమలును ఒకరోజు వాయిదావేస్తూ.. బుధవారం అర్ధరాత్రి ఆదేశాలి చ్చారు. పీయూడీఆర్ సంస్థ వేసిన పిటిషన్‌పై గురువారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. వివిధ కారణాల రీత్యా ఉరిశిక్షలను రద్దు చేయాలని, తగ్గించాలని కోరుతూ వచ్చి న పిటిషన్లతో దీనిని కూడా కలిపి విచారించాలని నిర్ణయించింది.

Advertisement
 
Advertisement
Advertisement