షహీన్బాగ్లో ఉద్రిక్తత
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఆందోళనలకు కేంద్ర బిందువుగా మారిన దేశ రాజధాని ఢిల్లీలోని షహీన్బాగ్లో ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. ధర్నా జరుగుతున్న ప్రాంతానికి సీఏఏ మద్దతుదారులు చేరుకుని విద్రోహులపై కాల్పులు జరపాలని నినాదాలు చేయడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. షహీన్బాగ్లో నిరసనకు దిగిన ఆందోళనకారులు తక్షణమే అక్కడి నుంచి ఖాళీచేయాలని డిమాండ్ చేశారు. సీఏఏ మద్దతుదారులు వందేమాతరం నినాదాలతో హోర్తెతించారు.
షహీన్బాగ్ నిరసనలను వ్యతిరేకించిన ఆందోళనకారులను కొందరిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని బస్సుల్లో ఇతర ప్రాంతాలకు తరలించారు. పారామిలటరీ బలగాలతో షహీన్బాగ్ వద్ద బందోబస్తును ముమ్మరం చేశారు. పోలీసు ఉన్నతాధికారులు అక్కడే మకాం వేసి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కాగా షహీన్బాగ్ వద్ద పౌర నిరసనలకు వ్యతిరేకంగా శనివారం తుపాకీతో హల్చల్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.