నెహ్రూ విధానాలకు తూట్లు: కాంగ్రెస్ | Nehru's policies undermined Congress | Sakshi
Sakshi News home page

నెహ్రూ విధానాలకు తూట్లు: కాంగ్రెస్

Jan 2 2015 2:47 AM | Updated on Mar 18 2019 9:02 PM

కేంద్ర ప్రణాళికా సంఘం పేరును నీతి ఆయోగ్‌గా మార్చడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రణాళికా సంఘం పేరును నీతి ఆయోగ్‌గా మార్చడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. దీని వెనుక నెహ్రూ, కాంగ్రెస్ వ్యతిరేక విధానమే కనిపిస్తోందని ఆ పార్టీ పేర్కొంది. నిజంగా సంస్కరణలు తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రణాళికా సంఘం పేరును యోజనా ఆయోగ్ నుంచి నీతి ఆయోగ్‌గా మార్చితే తమకు అభ్యంతరం లేదని, అయితే ప్రభుత్వ ఉద్దేశం వేరుగా ఉందని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వి గురువారం ట్వీటర్‌లో పేర్కొన్నారు.

మరో కాంగ్రెస్  నేత మనీశ్ తివారీ కూడా ఈ నిర్ణయంపై మండిపడ్డారు. నెహ్రూ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడిందని ఆయన విమర్శించారు. 1950లో ఏర్పాటైన ప్రణాళికా సంఘం పేరు మార్చడాన్ని ఇతర విపక్షాలు కూడా తప్పుబట్టాయి. ప్రభుత్వ నిర్ణయంపై సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు.

దీనివల్ల రాష్ట్రాలపై వివక్ష చూపే అవకాశం ఉంటుందని, అలాగే కార్పొరేట్ సంస్థలకు మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ప్రణాళికా సంఘాన్ని మార్చి కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతుందని సీపీఐ సీనియర్ నేత గురుదాస్ దాస్‌గుప్తా అభిప్రాయపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement