ఢిల్లీని కమ్మేసిన దుమ్ము, ధూళి..
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఢిల్లీ నగరాన్ని ధూళి తుపాన్ ముంచెత్తింది. దీంతో ఢిల్లీలోని పలుచోట్ల దుమ్ము వ్యాపించడంతో పగటిపూటే చీకట్లు అలుముకున్నాయి. ముఖ్యంగా ఘాజీపూర్ ప్రాంతంలో ఈ తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో రోడ్లపైకి వచ్చేవారు వాహనాలకు లైట్లు వేసుకుని వస్తున్నారు. ఉష్ణోగ్రతలు కూడా కొద్దిమేర తగ్గిపోయాయి. కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడుతున్నాయి. మరోవైపు బలమైన గాలులు కూడా వీస్తున్నాయి.
కాగా, ఢిల్లీలో 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే రానున్న రెండు రోజులు ఆకాశం మేఘావృతంగా ఉండనుందని వెల్లడించింది. కాగా, కొద్ది రోజులుగా ఎండ తీవ్రతతో ఇబ్బందిపడుతున్న ఢిల్లీ వాసులకు.. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు చల్లబడటం కొద్దిమేర ఉపశమనం కలిగించింది.