ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచిన పరీకర్
పణజి : నిరాండబరతకు, వృత్తిపట్ల అంకితభావానికి పెట్టింది పేరుగా నిలిచిన బీజేపీ సీనియర్ నేత, గోవా సీఎం మనోహర్ పరీకర్ ఆదివారం సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. క్యాన్సర్ లాంటి మహమ్మారి తన మీద దాడి చేసినప్పుడు కూడా పరీకర్ ఏ మాత్రం కుంగిపోలేదు. పైపెచ్చు చికిత్స తీసుకుంటూనే సీఏంగా రాష్ట్రానికి సేవలందించారు. బలమైన సంకల్పం ఉంటే వ్యాధి మనిషిని ఏమి చేయలేదని నిరూపించారు పరీకర్. మనిషి మేధస్సు ఏ రోగాన్నైనా జయిస్తుందంటూ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ట్వీట్ చేసిన పరీకర్ అందుకు తానే ఉదాహరణగా నిలిచారు. ఓ వైపు క్యాన్సర్కు చికిత్స తీసుకుంటూనే.. మరోవైపు తన విధులను సమర్థవంతంగా నిర్వహించి దేశానికే ఆదర్శంగా నిలిచారు పరీకర్. (నిరాడంబర సీఎం ఇకలేరు)
Human mind can overcome any disease. #WorldCancerDay
— Manohar Parrikar (@manoharparrikar) February 4, 2019
2018, ఏప్రిల్లో పరీకర్ ఆరోగ్యం తొలిసారి క్షీణించింది. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ను ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే ఆయనకు ప్యాంక్రియాటిక్ కేన్సర్ బాగా ముదిరినట్లు నిర్ధారణ అయింది. దీంతో అమెరికాకు వెళ్లిన పరీకర్ అక్కడే చికిత్స తీసుకున్నారు. అనంతరం 2018, జూన్లో జరిగిన గోవా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ ఏడాది జనవరి 30న గోవా బడ్జెట్ను ప్రవేశపెట్టారు పరీకర్. ఈ సందర్భంగా ‘గోవా ముఖ్యమంత్రిగా నా విధులను నిజాయతీగా, నిబద్దతో నిర్వహిస్తానని ఈ రోజు మరో సారి ప్రమాణం చేస్తున్నానం’టూ బడ్జెట్ స్పీచ్ సందర్భంగా పేర్కొన్నారు పరీకర్.