మోదీ, అమిత్‌ షాలపై దీదీ ఫైర్‌

 Mamata Banerjee Says Modi Is A Shameless PM And Amit Shah A Goonda - Sakshi

కోల్‌కతా : ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షాలపై పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. మోదీ సిగ్గులేని ప్రధాని అని, అమిత్‌ షా గూండా అని విమర్శించారు. త్రిపురలో లెనిన్‌ నుంచి గుజరాత్‌తో అంబేద్కర్‌ వరకూ విగ్రహాలను కూల్చిన చరిత్ర బీజేపీదేని దుయ్యబట్టారు. ఎన్నికల హింసలో ధ్వంసమైన సంఘసంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు.

విద్యాసాగర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు బెంగాల్‌ వద్ద నిధులు ఉన్నాయని..మీ డబ్బు అవసరం లేదని ఆమె వ్యాఖ్యానించారు. మీరు 200 సంవత్సరాల బెంగాల్‌ ఘన వారసత్వాన్ని తిరిగి తీసుకురాగలరా అని ప్రశ్నించారు. విద్యాసాగర్‌ విగ్రహాన్ని తృణమూల్‌ శ్రేణులు కూలదోశాయని నిరూపించగలరా అని మోదీని సవాల్‌ చేశారు.

విగ్రహాలను కూల్చే అలవాటు బీజేపీకే ఉందని దుయ్యబట్టారు. విద్యాసాగర్‌ విగ్రహాన్ని కాషాయ మూకలు ఎందుకు నేలమట్టం చేశాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మందిర్‌బజార్‌లో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు హింసను ప్రేరేపించేందుకు బీజేపీ నకిలీ వీడియోలను ప్రచారంలో పెడుతోందని ఆరోపించారు. బీజేపీ ఎంతగా ప్రయత్నించినా తనను నిలువరించలేరని ఆమె సవాల్‌ విసిరారు. కేంద్ర బలగాలతో డబ్బు పంచడం ద్వారా ఓటర్లను ఆకట్టుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top