కేరళకు రూ. పది కోట్లు సాయం ప్రకటించిన దీదీ
సాక్షి, కోల్కతా : వరదలతో తల్లడిల్లిన కేరళకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రూ పదికోట్ల సాయం ప్రకటించింది. వరదలతో తీవ్రంగా నష్టపోయిన కేరళకు ఈ సంక్షోభ సమయంలో అండగా నిలిచేందుకు రూ పది కోట్ల సాయం అందించాలని తాము నిర్ణయించామని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆదివారం వెల్లడించారు. కేరళ సీఎం సహాయ నిధికి ఈ మొత్తం అందిస్తామని మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.
కనీవినీ ఎరుగని ఈ ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కొనేందుకు కేరళకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అన్ని విధాలా సాయపడుతుందని స్పష్టం చేశారు. కేరళలో త్వరలోనే తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని తాము ప్రార్ధిస్తున్నామన్నారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు మమతా బెనర్జీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. వరదలను ఎదుర్కొంటున్న వారికి భగవంతుడు అవసరమైన శక్తిసామర్థ్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నామన్నారు.