ప్రేమమైకం: పాకిస్తాన్‌కు పయనం!

Maharashtra Man Tries To Cross Border As In Love With Pakistan Girl - Sakshi

అహ్మదాబాద్‌: ప్రేమమైకంలో మునిగిపోయిన ఓ యువకుడు దేశ సరిహద్దులు దాటేందుకు సిద్ధమయ్యాడు. పాకిస్తాన్‌లో ఉన్న ప్రేయసి చెంతకు చేరేందుకు పరితపించిపోయాడు. గూగుల్‌ మ్యాప్స్‌లో దారి వెదుక్కుంటూ రాణా ఆఫ్‌ కచ్‌ వద్ద సరిహద్దు భద్రతా సిబ్బంది కంటపడగా గురువారం అతడిని అడ్డుకున్నారు. తద్వారా దాయాది దేశంలో అతడు ఖైదీగా మారకుండా కాపాడారు. వివరాలు... మహారాష్ట్రకు చెందిన ఇరవై ఏళ్లు సిద్ధిఖి మహ్మద్‌ జిషాన్‌కు పాకిస్తాన్‌లోని కరాచికి చెందిన సమ్రా అనే యువతితో సోషల్‌ మీడియాలో పరిచయం ఏర్పడింది. తరచుగా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లో చాటింగ్‌ చేసుకునేవారు. (చదవండిఆ జనసంద్రాన్ని చూడండి: మాజీ ఎంపీ)

ఈ క్రమంలో ఆమెతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన జిషాన్‌ ఎలాగైనా తనను నేరుగా కలవాలనుకున్నాడు. ఇంట్లో చెప్పకుండానే పాకిస్తాన్‌కు వెళ్లేందుకు కార్యోన్ముఖుడయ్యాడు. గూగుల్‌ సాయంతో మహారాష్ట్ర నుంచి గుజరాత్‌లోని అంతర్జాతీయ సరిహద్దు దాటి ప్రేయసి వద్దకు చేరుకోవాలని భావించాడు. ఈ నేపథ్యంలో సరిహద్దుకు దాదాపు 1.5 కిలోమీటర్ల దూరంలో అచేతన స్థితిలో పడి ఉన్న జిషాన్‌ను గమనించిన బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది వివరాల గురించి ఆరా తీశారు. అతడి పాన్‌, ఆధార్‌ కార్డు, ఏటీఎంకార్డు, మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే అప్పటికే జిషాన్‌ తల్లిదండ్రులు ఫిర్యాదుతో మహారాష్ట్ర పోలీసులు గుజరాత్‌లోని కచ్‌ జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు.(14 ఏళ్ల ఆ బాలికకు మానసిక పరిపక్వత ఉంది..) 

ఈ క్రమంలో బీఎస్‌ఎఫ్‌కు ఈ విషయం గురించి తెలియజేయగా.. జిషాన్‌ నుంచి వివరాలు సేకరించి అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. కాగా ఈ ఘటనపై భద్రతా సంస్థలు అన్ని కోణాల్లో లోతుగా విచారణ జరుపనున్నట్లు సమాచారం. ఇక గతంలో మహారాష్ట్రకు చెందిన హమీద్‌ అన్సారీ అనే యువకుడు తనకు ఫేస్‌బుక్‌లో పరిచయమైన అమ్మాయి కోసం పాకిస్తాన్‌ వెళ్లిన విషయం తెలిసిందే. అక్రమంగా దేశంలో అడుగుపెట్టాడన్న కారణంతో 2012లో అతడిపై కేసు నమోదు చేయగా.. ఆరేళ్ల తర్వాత విడుదలయ్యాడు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top