తెలుగుకు ప్రాచీన హోదా ఎలా కల్పించారు? | madras highcourt questions central govenment on telugu language | Sakshi
Sakshi News home page

తెలుగుకు ప్రాచీన హోదా ఎలా కల్పించారు?

Jun 22 2016 3:14 AM | Updated on Oct 8 2018 3:56 PM

తెలుగు తదితర ప్రాంతీయ భాషలకు ప్రాచీన హోదాను ఏ ప్రాతిపదికన కల్పించారో ఆధారాలు సహా చూపాలని కేంద్ర ప్రభుత్వ అధికారులను మద్రాసు హైకోర్టు ఆదేశించింది.

కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మద్రాసు హైకోర్టు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తెలుగు తదితర ప్రాంతీయ భాషలకు ప్రాచీన హోదాను ఏ ప్రాతిపదికన కల్పించారో ఆధారాలు సహా చూపాలని కేంద్ర ప్రభుత్వ అధికారులను మద్రాసు హైకోర్టు ఆదేశించింది. తెలుగు తదితర భాషలకు కల్పించిన ప్రాచీన హోదాను రద్దు చేయాల్సిందిగా సీనియర్ న్యాయవాది ఆర్ గాంధీ ఇటీవల దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు స్పందించింది. పిల్‌లో వివరాలు ఇలా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వేలాది భాషలు ఉండగా రెండు వేల సంవత్సరాలకు పైగా సాహిత్య సంపద, గ్రంధాలు కలిగి ఉన్న భాషలకు మాత్రమే ప్రాచీన భాష హోదాను కల్పిస్తున్నారు. ఆయా ప్రమాణాలు లేని కారణంగానే అరబిక్, పర్సియన్ తదితర భాషలకు ప్రాచీన హోదా ఇవ్వలేదు.

అలాంటిది తెలుగు, కన్నడాలకు 2005లోనూ, మలయాళంకు 2013లోనూ, ఒడిశాకు 2014లోనూ ప్రాచీనభాష హోదాను ఎలా కల్పించారు. తగిన అర్హత లేకుండా వాటికి కల్పించిన ప్రాచీన హోదాను రద్దు చేయాలని పిల్‌లో పేర్కొన్నారు. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి ఆర్ మహాదేవన్‌ల ముందుకు సోమవారం పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ పిల్ విచారణను జూలై 13వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తె లుపుతూ, పిటిషన్ దారుడు పేర్కొన్న తెలుగు తదితర భాషలకు ప్రాచీన హోదా ఎలా కల్పించారు, ఇందుకు ఉన్న ఆధారాలు ఏమిటో తగిన డాక్యుమెంట్లతో కేంద్రప్రభుత్వ ఉన్నతాధికారులు 13వ తేదీన నేరుగా హాజరుకావాలని ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement