సోదరుడిని కలవనివ్వండి: కశ్మీరీ యువతి ఆవేదన | Kashmir People Request Phone Connectivity In Jammu Border | Sakshi
Sakshi News home page

మా సోదరుడిని కలవాలి: కశ్మీరీ యువతి ఆవేదన

Aug 12 2019 9:26 AM | Updated on Aug 12 2019 9:28 AM

Kashmir People Request Phone Connectivity In Jammu Border - Sakshi

శ్రీనగర్‌: గత వారం రోజులుగా బయటి ప్రపంచంతో కశ్మీరీలకు సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే. దీంతో కశ్మీరీలకు ఊరనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇంటర్నెట్, ఫోన్ సర్వీసులపై విధించిన ఆంక్షలను పాక్షికంగా సడలించింది. సోమవారం నాటి ప్రార్థనలను దృష్టిలో పెట్టుకుని.. ఆంక్షల సడలింపు నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 370 తొలగింపు, రాష్ట్ర విభజన నేపథ్యంలో కశ్మీర్‌లో కేంద్రం కర్ఫ్యూ విధించింది. ఇంటర్నెట్, ఫోన్ సర్వీసులను పూర్తిగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ఫోన్‌ సర్వీసులు పనిచేస్తున్నప్పటికీ సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ వారంలో బక్రీద్‌, రాఖీ పౌర్ణమి ఉన్న నేపథ్యంలో కర్ఫ్యూ ని ఎత్తివేసి, ఇంటర్‌నెట్‌, ఫోన్‌ సర్వీసులను పునరుద్దరించాలని ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు ఆదివారం ఓ కశ్మీరీ యువతి అక్కడున్న ఇబ్బందికర పరిస్థితులను గ్రీవెన్స్‌లో వ్యక్తం చేసింది. ‘మా ప్రాంతంలో కనీసం ఇంటర్‌నెట్‌, ఫోన్‌ సర్వీసు కూడా లేదు. మా కుంటుంబ సభ్యులతో మాట్లాడక వారం గడుస్తోంది. ఈనెల 15న రాఖీ సందర్భంగా మా సోదరుడుని కలవాలి. దయచేసి ఆంక్షల నుంచి మాకు విముక్తి కల్పించండి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా పలుప్రాంతాల్లో ముస్లింల ప్రార్థనలపై ఆంక్షలను పాక్షికంగా సడలించిన విషయం తెలిసిందే. బక్రీద్‌ పర్యదినాన్ని పురస్కరించుకుని సోమవారం పెద్ద ఎత్తున ప్రార్థనలో పాల్గొననున్నారు. నగరంలోని ప్రధానమైన జమా మసీదు తెరవకపోయినప్పటికీ.. చిన్న చిన్న మసీదుల్లో ప్రార్థనలకు అనుమతిచ్చారు. ప్రార్థనలపై ఎలాంటి ఆంక్షలు లేవని ఆర్మీ అధికారులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement