
న్యూఢిల్లీ: కొలీజియం సమావేశాల్లో మరింత పారదర్శకత అవసరమని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జె.చలమేశ్వర్ అన్నారు. హైకోర్టు జడ్జీల్ని సుప్రీంకోర్టుకు ప్రమోట్ చేసే సమయంలో పనితీరు సరిగా అంచనావేయడం అరుదుగా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ‘భారతదేశ అత్యున్నత న్యాయవ్యవస్థ: వివాదాంశాలు, భవిష్యత్తు అంచనాలు’ అంశంపై నిపుణుల బృందంతో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ‘మున్ముందు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఎంపిక ప్రక్రియలో పాల్గొనేవారు.. వారి అభిప్రాయాల్ని అధికారికంగా నమోదు చేయాలి’ అని సూచించారు. సుప్రీంకోర్టులో అవసరమైన సంస్కరణలపై మాట్లాడుతూ.. ‘సుప్రీంకోర్టుకు కేటాయించిన న్యాయమూర్తుల సంఖ్య 31. ఆ సంఖ్య ప్రకారం చూస్తే.. సుప్రీంలో తమకు ప్రాతినిధ్యం ఉండడాన్ని ప్రతి రాష్ట్రం హక్కుగా భావిస్తోంది’ అని చెప్పారు. సుప్రీంకోర్టులో శాశ్వత రాజ్యాంగ ధర్మాసనం ఉండాల్సిన అవసరంపై ఆయన స్పందిస్తూ.. దీనిపై మళ్లీ దృష్టిసారించాల్సిన అవసరముందన్నారు.