గుజరాత్‌ ఎన్నికల ఆలస్యానికి కారణాలివే..! | Sakshi
Sakshi News home page

గుజరాత్‌ ఎన్నికల ఆలస్యానికి కారణాలివే..!

Published Tue, Oct 24 2017 2:08 AM

Gujarat Assembly Election 2017: Congress and Patidar leaders ... - Sakshi

న్యూఢిల్లీ: గుజరాత్‌ కంటే ముందుగా హిమాచల్‌ ప్రదేశ్‌లో ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఏకే జోతి సమర్ధించుకున్నారు. హిమాచల్‌లో ప్రతికూల వాతావరణం, గుజరాత్‌లో వరద సహాయక చర్యలు, పండుగలు సహా పలు అంశాల్ని పరిగణనలోకి తీసుకుని గుజరాత్‌ కంటే ముందుగా హిమాచల్‌ ఎన్నికల షెడ్యూల్‌ను నిర్ణయించామని జోతి చెప్పారు. ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో ఈ అంశంపై స్పష్టతనిచ్చారు. 

‘చలికాలం, హిమపాతం నేపథ్యంలో నవంబర్‌ 15కు ముందే హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికలు నిర్వహించాలని పలు రాజకీయ పార్టీలు, రాష్ట్ర అధికార యంత్రాంగం ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించాయి. ఆలస్యం చేస్తే మూడు జిల్లాల్లో ఎన్నికల నిర్వహణ కష్టమని వారు చెప్పారు. అందుకే గుజరాత్‌ కంటే ముందుగా హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించాం’ అని స్పష్టం చేశారు. గుజరాత్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ఎప్పుడు ప్రకటిస్తారని ప్రశ్నించగా.. త్వరలోనే సమాచారం ఇస్తామన్నారు.

‘గుజరాత్‌లో దీపావళి ప్రధాన పండుగ. మరోవైపు జూలై నెలలో వచ్చిన వరదలకు సంబంధించిన సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. అందుకే ఆ రాష్ట్రంలో ముందుగా ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించలేదు’ అని జోతి వివరణ ఇచ్చారు. 2012లో గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌లో ఎన్నికల షెడ్యూల్‌ను ఒకేసారి ప్రకటించినా... ఎన్నికల నిర్వహణ తేదీలు మాత్రం వేరని, రెండు రాష్ట్రాల్లో భౌగోళిక, వాతావరణ పరిస్థితులు ఒకేలా లేవన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌ ఫలితాల ప్రభావం గుజరాత్‌ ఓటర్లపై పడకుండా గుజరాత్‌ ఎన్నికల షెడ్యూల్‌ను రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు. ‘ఒక రాష్ట్రంలో ఎన్నికల సరళి ప్రభావం మరో రాష్ట్రంపై పడకుండా ఎన్నికల సంఘం  జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకే హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల కౌంటింగ్‌ను డిసెంబర్‌ 18న పెట్టాం. ఈ లోపే గుజరాత్‌ ఎన్నికలను ముగిస్తాం’ అని వివరించారు.

Advertisement
Advertisement