నవరాత్రుల సందర్భంగా వైష్ణోదేవి భక్తులకు శుభవార్త

Delhi Katra Vande Bharat Train To Start Maiden Journey During Navratras - Sakshi

ఢిల్లీ : కశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త.  ఢిల్లీ నుంచి కాట్రా వరకు ప్రయాణించే రెండవ వందే-భారత్‌ రైలును ప్రారంభించనుంది. దసరా నవరాత్రి ఉత్సవాల రోజుల్లో ఇది ప్రారంభం కానున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ అధికారికంగా వెల్లడించారు. ఇప్పటికే భారత్‌ మొదటి సెమీ హై స్పీడ్‌ రైలు వందే భారత్‌ ఢిల్లీ-వారణాసీ మధ్య నడుస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ రైలు విజయవంతంగా నడుస్తుండటంతో ఇటీవలే భారత రైల్వే మరో 40 నూతన వందే-భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో దేవి నవరాత్రుల్లో వైష్ణో దేవి  పవిత్ర దేవాలయాన్ని సందర్శించే లక్షలాది యాత్రికులకు అనుకూలంగా ఉండే ఢిల్లీ-కాట్రా వందే భారత్‌ రైలును నవరాత్రి రోజుల్లో ప్రారంభించనుంది. ఈ విషయాన్ని పీయూష్‌ గోయల్‌ తన ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. 

భారత రైల్వే బోర్డు చైర్మన్‌ వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా ట్రయల్ రన్ కింద ఢిల్లీ-కాట్రా వందే-భారత్‌ రైలుకు సంబంధించిన ట్రయల్‌ రన్‌ ఇప్పటికే విజయవంతంగా పూర్తి అయిందనీ, ఇది వైష్ణో దేవి యాత్రికులకు శుభవార్త అని పేర్కొన్నారు.  ఈ రైలు ఢిల్లీ జంక్షన్‌ నుంచి ఉదయం 6 గంటలకు ప్రారంభమై అంబాలా, లుధియానా, జమ్మూతావి మీదుగా మధ్యాహ్నం 2 గంటలకు కాట్రాకు చేరుకోనుంది. 130 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ రైలు.. కాట్రాకు 8 గంటల్లో చేరుకోనుందన్నమాట. 

అలాగే  రద్దీగా ఉండే  పలు రైల్వే మార్గాలను సరళీకృతం చేయడానికి ప్రయత్రిస్తున్నట్లు వినోద్‌ కుమార్‌ తెలిపారు. ఢిల్లీ-ముంబై, ఢిల్లీ- హౌరా రైళ్లు 2021 నాటికి సిద్ధమవుతాయన్నారు. ఇక నూతనంగా ప్రారంభించబోతున్న 40 వందే-భారత్‌ రైళ్ల గురించి మాట్లాడుతూ..వీటి టెండర్‌ విషయంలో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తాజాగా పూర్తి పారదర్శకతతో కొత్త టెండరింగ్‌ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ రైళ్లు పూర్తి భారతీయ సాంకేతికతతో తయారు అవుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఢిల్లీ-కాట్రా రైలు ఢిల్లీ జంక్షన్‌ నుంచి ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యి అంబాలా, లుధియానా, జమ్మూతావి మీదుగా మధ్యాహ్నం 2 గంటలకు కాట్రాకు చేరుకోనుంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top