పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు మద్దతిస్తాం కానీ భూసేకరణ సంబంధించిన ఆర్డినెన్స్ విషయంలో తమ వైఖరి మార్చుకోబోమని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు మద్దతిస్తాం కానీ భూసేకరణ సంబంధించిన ఆర్డినెన్స్ విషయంలో తమ వైఖరి మార్చుకోబోమని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఈ విషయంలో ఏ మాత్రం మెతకగా వ్యవహరించలేమని తెలిపింది. సమావేశాల నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఆదివారం ఉదయం కలిశారు. సమావేశాలు సజావుగా సాగేందుకు తాము సహకరిస్తామని సోనియా చెప్పినట్లు తెలిపారు.
అయితే, కాంగ్రెస్కే చెందిన ఆనంద్ శర్మ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ భూసేకరణ ఆర్డినెన్స్పై రాజీపడబోమన్నారు. బొగ్గు ఆర్డినెన్స్ విషయంలో కూడా వెనక్కి తగ్గబోమని చెప్పారు. చట్టసభల్లో అందరి ఆమోదంతో చేయాల్సిన చట్టాలను బీజేపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చి వేరే మార్గం ద్వారా ఆమోదింప చేసుకోవాలని చూస్తోందని విమర్శించారు. భూసేకరణ ఆర్డినెన్స్ ముమ్మాటికీ రైతులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్నదేనని, దానికి తాము అంగీకరించబోమని చెప్పారు.