డీజీపీ ఆస్తులపై సీబీఐ ప్రాథమిక విచారణ | CBI Primary investigation on DGP properties | Sakshi
Sakshi News home page

డీజీపీ ఆస్తులపై సీబీఐ ప్రాథమిక విచారణ

Sep 19 2013 2:14 AM | Updated on Sep 1 2017 10:50 PM

రాష్ట్ర డీజీపీ వి.దినేష్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ వచ్చిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు ఉపక్రమించింది.

16నే కేసు నమోదు చేసినట్లు సీబీఐ వర్గాల వెల్లడి
 సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర డీజీపీ వి.దినేష్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ వచ్చిన ఆరోపణలపై  సీబీఐ దర్యాప్తునకు ఉపక్రమించింది. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ వ్యవహారంపై సీబీఐ 16వ తేదీన ప్రాథమిక విచారణ(పీఈ)కు కేసు నమోదు చేసిందని సీబీఐ ఉన్నత స్థాయి వర్గాలు బుధవారం ఢిల్లీలో వెల్లడించాయి.
 
 దినేష్‌రెడ్డి ఆస్తుల విషయమై ఐపీఎస్ అధికారి ఉమేశ్‌కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దానిపై విచారణ ప్రారంభించిన న్యాయమూర్తులు జస్టిస్ బి.ఎస్.చౌహాన్, జస్టిస్ ఎస్.ఎ.బాబ్డేతో కూడిన ధర్మాసనం ఈ నెల 6న సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. దినేష్‌రెడ్డి ఆస్తుల క్రయ విక్రయాల దస్తావేజులను దర్యాప్తు నిమిత్తం సీబీఐకి అందించాలని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించింది. అలాగే, కేసు దర్యాప్తుపై నివేదికను నాలుగు నెలల్లోగా తమకు సమర్పించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ప్రాథమిక విచారణ చేపట్టినట్లు సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement