కేంద్ర కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ విలయతాండవం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఈ సంక్షోభాన్ని నివారించి ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు కేంద్ర కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే నిత్యావసర వస్తువుల చట్టాన్ని(ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్) బుధవారం సవరిస్తు కీలక నిర్ణయం తీసుకుంది. నిత్యావసర వస్తువుల చట్టాన్ని సవరించడం వల్ల దేశ వృద్ధికి కీలకమైన వ్యవసాయరంగం మరింత పుంజుకుంటుందని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఈ చట్టాన్న ఆహార కొరతను ఎదుర్కొన్న సమయంలో అమలు చేశారని.. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో పెట్టుబడులను ఆకర్శించేందుకు ఉపయోగపడుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ చట్టం ద్వారా 50 ఏళ్ల రైతుల డిమాండ్ నెరవేరిందని జవదేకర్ అన్నారు. పెట్టుబడులను ఆకర్శించేందుకు ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సెల్స్(పీడీసీ)కు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. మరోవైపు కోల్కత్తా పోర్ట్ ట్రస్ట్ను శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ట్రస్ట్గా పేరు మార్చడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు.