రామచరిత మానస్‌ మానుకో.. లేదంటే..!

Attack on a Muslim Man for Reading Hindu Scriptures - Sakshi

లక్నో ‌: హిందూ మత గ్రంథాలు చదువుతున్న ఓ ముస్లిం వ్యక్తిపై అదే వర్గానికి చెందిన యువకులు దాడి చేశారు. ఇంకెప్పుడైనా హిందూ మతగ్రంథాలు చదువుతున్నట్టు తెలిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ ఘటన మీరట్‌లో వెలుగుచూసింది. వివరాలు.. ఢిల్లీగేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివసించే దిల్షర్ ‌(55) సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతనికి గత 40 ఏళ్ల నుంచి హిందూమత పవిత్ర గ్రంథాలైన రామచరిత మానస్‌, భగవద్గీత పఠించడం అలవాటు. ఆ క్రమంలో శుక్రవారం కూడా రోజులాగే డ్యూటీ నుంచి వచ్చి రామచరిత మానస్‌ను పఠించడానికి సిద్ధమవుతుండగా.. జకీర్‌, సమీర్‌ అనే ఇద్దరు యువకులు ఇంట్లోకి చొరబడి ఆయనపై దాడి చేశారు. ఇలాంటి చర్యలు మానుకోకుంటే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఘటనపై బాధితుడు మాట్లాడుతూ.. ‘ఆధ్యాత్మిక  గ్రంథాలు చదవితే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఏదేమైనా నా సొంత వర్గీయులు చేసే ఇలాంటి దాడులను ఎదుర్కోవడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను’అన్నారు. దిల్షర్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top