మోహిని వచ్చేస్తోంది

Trisha's Mohini to release on July 27 - Sakshi

దాదాపు రెండేళ్లు పూర్తి కావొచ్చింది తెలుగు తెరపై చెన్నై సుందరి త్రిష కనిపించి. 2016లో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం ‘నాయకి’లో నటించారామె. ఇప్పుడు మళ్లీ ‘మోహిని’ సినిమాతో తెలుగు తెరపై కనిపించనున్నారు. త్రిష ప్రధాన పాత్రలో ఆర్‌. మాదేష్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘మోహిని’.  ఈ చిత్రాన్ని అదే టైటిల్‌తో లక్ష్మి పిక్చర్స్‌ తెలుగులో విడుదల చేయనుంది. ఎస్‌. లక్ష్మణ్‌ కుమార్, శ్రీనివాస రావు పల్లెల, కరణం మధులత నిర్మాతలు. గుంటూరు కాశిబాబు, డీవీ మూర్తి సహ–నిర్మాతలు.

జాకీ, యోగి బాబు, పూర్ణిమ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వివేక్‌ మెర్విన్‌ సంగీతం అందించారు. ‘‘ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై క్రేజ్‌ ఏర్పడింది. మాదేష్‌ చాలా మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. త్రిష నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన ‘మోహిని’ సినిమాను ఈ నెల 27న విడుదల చేయనున్నాం. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు చిత్రబృందం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top