
పట్నా : బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యపై మాజీ ఎంపీ, జన్ అధికార్ పార్టీ (జేఏపీ) చీఫ్ పప్పు యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనది ఆత్మహత్య కాదని, హత్య అని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సీబీఐ విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం సుశాంత్ కుటుంబ సభ్యులతో భేటీ అయిన పప్పు యాదవ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు మృతిపై కుటుంబ సభ్యులు కూడా సీబీఐ విచారణకు పట్టుపడుతున్నారని తెలిపారు. ఆయన మరణంతో కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచుసుకుందని, హత్యా..? ఆత్మహత్యా? అనేది తేలాల్సిందని పేర్కొన్నారు. (సుశాంత్సింగ్ ఆత్మహత్య)
ఇక సుశాంత్ రాజ్పూత్ మృతిపై బిహార్లోని ఆయన నివాసప్రాంతంలో ఉండే సన్నిహతులు సైతం పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకునేంత పరికివాడు కాదని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సుశాంత్ మృతిలో ఎవరికీ తెలియని కుట్రదాగి ఉందని సందేహించారు. కాగా ముంబైలోని బాంద్రాలో తన నివాసంలో ఆదివారం సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై యావత్ సినీ, క్రీడాలోకం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మరోవైపు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఆయన మృతదేహానికి నిర్వహించిన పోస్ట్మార్టం రిపోర్టును బట్టి విచారణలో ముందుకు వెళ్తామని చెబుతున్నారు. (తొందరగా వెళ్లిపోయావ్ మిత్రమా!)