ఇక అంతా యాక్షనే !

Nikesha Patel is a boxer in a new film - Sakshi

తమిళసినిమా: ఇకపై అంతా యాక్షనే అంటోంది నటి నికీషాపటేల్‌. 2010లో పులి చిత్రంతో పవన్‌కల్యాణ్‌కు జంటగా టాలీవుడ్‌కు దిగుమతి అయిన గుజరాతీ బ్యూటీ నికీషాపటేల్‌. అది నిజంగా లక్కీచాన్సే అయినా చిత్రం నిరాశపరచంతో అమ్మడిని అక్కడ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో కోలీవుడ్‌పై లుక్కేసింది. ఇక్కడ తలైవన్‌ చిత్రంతో పరిచయమైంది. ఈ చిత్రం నికీషాకు బ్రేక్‌ ఇవ్వలేదు. అయితే కొన్ని అవకాశాలను మాత్రం రాబట్టుకుంది.

ఎన్నమో ఏదో, కరైయోరం, నాథన్, 7 నాట్కళ్‌ వంటి చిత్రాలతో కోలీవుడ్‌లో గుర్తింపు తెచ్చికున్న నికీషాపటేల్‌ మధ్యలో మలయాళం, కన్నడం భాషల్లోనూ మెరిసింది. అయితే ఎక్కడ పోగుట్టుకుంటే అక్కడే వెతుక్కోవాలన్న సామెతలా తాజాగా టాలీవుడ్‌ నాయకిగా రాణించడానికి తీవ్రంగా ఖుషి చేస్తోంది. తన ప్రయత్నం ఫలించి ఒక తెలుగు చిత్రం తలుపు తట్టింది. ఈ చిత్రంలో తన తడాఖా చూపిస్తానంటోంది భామ. దీని గురించి నికీషాపటేల్‌ మాట్లాడుతూ నవ దర్శకుడు తెరకెక్కించనున్న ఈ చిత్రంలో తాను యాక్షన్‌ హీరోయిన్‌గా నటించనున్నానని చెప్పింది.

తాను నిజజీవితంలో బాక్సింగ్‌ క్రీడాకారిణినని, యాక్షన్‌ కథ పాత్రల్లో నటించాలన్నది చిరకాల కోరిక అని తెలిపింది. అది ఈ చిత్రంతో నెరవేరనుండడం సంతోషంగా ఉందని అంది. ఈ పాత్రలో రఫ్‌ ఆడిస్తానని చెప్పింది. అంతే కాదు యాక్షన్‌ హీరోయిన్‌గా రాణించాలని ఆశ పడుతున్న నికీషాపటేల్‌ ఇకపై యాక్షన్‌ కథా చిత్రాలనే కమిట్‌ అవుతానని పేర్కొంది. ఈ చిత్రంలో ముకుల్‌ దేవ్‌ విలన్‌గా నటిస్తున్నారట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని నికీషాపటేల్‌ అంటోంది. ఈ చిత్రం అయినా ఈ అమ్మడి కెరీర్‌ను మలుపు తిప్పుతుందేమో చూద్దాం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top