సూపర్‌ న్యాచురల్‌ సుబ్రహ్మణ్యపురం

Naga Chaitanya gave clap for Sumanth's 25th film Subramanyapuram - Sakshi

సుమంత్, ఈషా రెబ్బ జంటగా నూతన దర్శకుడు సంతోష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. తారస్‌ సినీకార్ప్‌ పతాకంపై ధీరజ్‌ బొగ్గారం, బీరం సుధాకర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి హీరో నాగచైతన్య క్లాప్‌నివ్వగా, దర్శకుడు ప్రశాంత్‌ వర్మ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. దర్శకుడు చందు మొండేటి గౌరవ దర్శకత్వం వహించారు.

చిత్రం లోగోను ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి, రాజశేఖర్, జీవితా సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుమంత్‌ మాట్లాడుతూ – ‘‘దర్శకుడు సంతోష్‌ స్టోరీ న్యారేషన్‌లోనే సినిమాను చూపించారు. సూపర్‌ న్యాచురల్‌ అంశాలున్న మిస్టరీ థ్రిల్లర్‌ మూవీ ఇది. ఇలాంటి జోనర్‌ అంటే నాకు భయం కానీ కథ నచ్చి చేస్తున్నాను. నిర్మాతలు గుర్తు చేసేవరకు ఇది నా 25వ సినిమా అని నాకు తెలియదు. అందుకే సందడిగా ప్రారంభించారు’’ అన్నారు. ‘‘కథ వింటున్నప్పుడు తర్వాత ఏంటి? అనే ఉత్కంఠతో ఎదురు చూశాను.

ఆడియన్స్‌ కూడా అలానే ఫీల్‌ అవుతారని అనుకుంటున్నాను’’ అన్నారు ఈషా. ‘‘నా షార్ట్‌ ఫిల్మ్స్‌ చూసి నిర్మాతలు నాకీ అవకాశం ఇచ్చారు. సింపుల్‌గా అవుట్‌లైన్‌ చెబుదాం అని వెళ్తే క్లియర్‌గా స్టోరీ అంతా చెప్పమన్నారు సుమంత్‌గారు. కథ అంతా విన్న తర్వాత అంగీకరించారు. ఏప్రిల్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం’’ అన్నారు దర్శకుడు. ‘‘సుమంత్‌గారి 25వ సినిమా నిర్మించడం ఆనందంగా ఉంది. సుధాకర్‌ రెడ్డిగారు మంచి సహకారం అందిస్తున్నారు’’ అన్నారు ధీరజ్‌ రెడ్డి. ఈ చిత్రానికి కెమెరా: ఆర్‌.కె. ప్రతాప్, సంగీతం: శేఖర్‌ చంద్ర.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top