ఖుషీ కపూర్‌ని సాగనంపుతూ.. బోనీ ఉద్వేగం | Khushi Kapoor Leaves To America For Acting | Sakshi
Sakshi News home page

ఖుషీ కపూర్‌ని సాగనంపుతూ.. బోనీ ఉద్వేగం

Sep 10 2019 4:03 PM | Updated on Sep 10 2019 6:16 PM

Khushi Kapoor Leaves To America For Acting - Sakshi

అతిలోక సుందరి, దివంగత బాలీవుడ్ నటి శ్రీదేవి కుటుంబానికి సంబంధించిన ప్రతీవార్త వైరల్‌గా మారుతుంది. ముఖ్యంగా శ్రీదేవి ముద్దుల కూతుళ్లు జాన్వీ కపూర్‌, ఖుషీ కపూర్‌లకు సంబంధించిన వార్తలు తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తికనబరుస్తుంటారు. శ్రీదేవి మరణం తరువాత వీరికి సంబంధించిన వార్తలు మీడియాలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తండ్రి బోనీ కపూర్‌ కూడా తరుచూ కుమార్తెలతో కలిసి పబ్లిక్‌ ఫంక్షన్స్‌కు వస్తుండటంతో మీడియా వారికి కావాల్సినంత కవరేజ్‌ ఇస్తోంది. ఇప్పటికే జాన్వీ వెండితెర అరంగేట్రం ఘనంగా జరిగింది. ఆమె లుక్స్‌, నటనకు అభిమానులు మంచి మార్కులే వేశారు.

తాజాగా జాన్వీ చెల్లెలు, ఖుషీ కూడా సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా నటనలో శిక్షణ పొందేందుకు విదేశాలకు పయనమయ్యారు. అయితే చిన్న కూతురుని విదేశాలకు సాగనంపుతూ తండ్రి బోనీ కపూర్‌ ఉద్వేగానికి లోనయ్యారు. ఎయిర్‌పోర్ట్‌లో ఆమెకు సెండాఫ్ ఇస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఖుషీ న్యూయార్క్‌ ఫిలిం అకాడమిలో యాక్టింగ్ కోర్స్‌ చేసేందుకు అమెరికా వెళ్లారు. ఆమెకు వీడ్కోలు పలికేందుకు బోనీ తో పాటు.. ఆయన తమ్ముడి( సంజయ్‌ కపూర్‌) భార్య మహీప్‌ కపూర్‌, వారి కూతురు షానయా కపూర్‌లు ముంబై ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. ఎయిర్‌పోర్ట్‌లో వీరంతా కలిసి దిగిన సెల్పీ ఫోటోను మహీప్‌ కపూర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

కాగా ఖుషీ గతంలోనే ఓ ఇంటర్వ్యూలో ‘న్యూయార్క్‌ వెళ్లి యాక్టింగ్‌ నేర్చుకొని.. ఆ తర్వాత తనకు నచ్చిన వృత్తిని ఎంచుకుంటాని’ తెలిపారు. ఇటీవల జాన్వీ, ఖుషీలు సింగపూర్‌లో ఏర్పాటు చేసిన తన తల్లి శ్రీదేవి మైనపు బొమ్మను సందర్శించి, ఆ బొమ్మను తాకి ఉద్వేగానికి గురైన విషయం తెలిసిందే. ఖుషీ గతంలో మోడలింగ్‌ వైపు వెళ్తుందని బోని తెలిపారు. కానీ ప్రస్తుతం ఖుషీ మోడలింగ్‌ కంటే యాక్టింగ్‌పైనే ఎక్కువగా ఆసక్తి చూపుతోందని తెలుస్తోంది. ఇప్పటికే బోని పెద్ద కుమార్తె జాన్వి కపూర్‌, కొడుకు అర్జున్‌ కపూర్‌లు సినిమాలతో బిజీగా ఉన్నారు. అర్జున్‌ కపూర్‌ అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహిస్తున్న‘పానిపట్‌’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. జాన్వీ కపూర్‌.. గుంజన్‌ సక్సెస్‌ బయోపిక్‌లో నటిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement