ప్రేక్షకులు మెచ్చిందే పెద్ద సినిమా

kathanam movie teaser launch - Sakshi

‘‘డబ్బుతో ముడిపెట్టి పెద్ద సినిమా, చిన్న సినిమా అని అనడం సరికాదు. ప్రేక్షకులకు నచ్చిందే పెద్ద సినిమా.’’ అని నటి అనసూయ అన్నారు. రాజేష్‌ నాదెండ్ల దర్శకత్వంలో అనసూయ భరద్వాజ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కథనం’. బేబి గాయత్రి రెడ్డి సమర్పణలో బి. నరేంద్ర రెడ్డి, శర్మ చుక్కా నిర్మించారు. ఈ నెల 9న విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. సీనియర్‌ పాత్రికేయులు పసుపులేటి రామారావు టీజర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ– ‘‘నాగార్జునగారు నా ఫేవరెట్‌ హీరో. ఆయన సినిమా (‘మన్మథుడు 2’ ఈ నెల 9న విడుదల కానుంది) పోస్టర్, నా సినిమా పోస్టర్‌ ఒకే రిలీజ్‌ టైమ్‌కి చూస్తాననుకోలేదు. ఇది ఆయనతో పోటీపడటం కాదు. కథనం, మన్మథుడు 2 సినిమాల జానర్స్‌ కూడా వేరు. ధనరాజ్‌ వల్లే ఈ చిత్రంలో నటించాను. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో ఒకే ఒక పాట ఉంది. సతీష్‌ కెమెరా వర్క్‌ నాలో కాన్ఫిడెన్స్‌ నింపింది. రోషన్‌ మంచి సంగీతం ఇచ్చారు’’ అని అన్నారు.

‘‘సెలవులు కలిసి రావడం, దగ్గర్లో మరో విడుదల తేదీ లభించకపోవడంవల్లే ఈ నెల 9న మా సినిమాను విడుదల చేస్తున్నాం. పెద్ద చిత్రంతో పోటీపడాలని కాదు. అనసూయ నటన ఈ సినిమాకు హైలైట్‌గా ఉంటుంది’’ అని నిర్మాతలు తెలిపారు. ‘‘మన్మథుడు 2’ సినిమాకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ప్రచారం చేస్తున్నాం. నైజాంలో ‘దిల్‌’ రాజుగారు విడుదల చేయడం హ్యాపీ’’ అన్నారు రాజేష్‌. ‘‘భాగమతి’ తర్వాత ఆ స్థాయి పాత్ర ఈ సినిమాలో చేసే అవకాశం వచ్చింది’’ అని ధనరాజ్‌ అన్నారు. ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎమ్‌. విజయ చౌదరి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top