కంటతడి పెట్టిన కమల్హాసన్
శివాజీ ఇంట్లో కమల్హాసన్కు విందు
పెరంబూరు: దివంగత నటుడు, నడిగర్ తిలగం శివాజీ గణేశన్కు నటుడు కమలహాసన్ అంటే చాలా ఇష్టం. కమలహాసన్ కూడా ఆయన్ని అప్పా(నాన్న) అని ప్రేమాభిమానంతో సంబో ధించేవారు. ఇక శివాజీ గణేశన్ లేకపోయినా ఇప్పటికీ, ఆయన కుటుంబం కమలహాసన్ను తమలో ఒకరిగా భావిస్తారు. కమలహాసన్ ఎంత గొప్ప నటుడైనా, రాజకీయనాయకుడైనా శివాజీగణేశన్ ఇంటి పెద్దకొడుకుగానే వారు భావిస్తారు. కాగా కమలహాసన్ నటుడిగా 60 ఏళ్లను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ని శివాజీ గణేశన్ కుటుంబ సభ్యులు నటుడు ప్రభు, రామ్కుమార్ తదితరులు శుక్రవారం స్థానిక బోగి రోడ్డులోని శివాజీ ఇంటికి ఆహ్వానించి విందునిచ్చారు. ఆయనతో పాటు ఆయన కుమార్తె శ్రుతిహాసన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివాజీ గణేశన్ కుటుంబ సభ్యులు రామ్కుమార్, ప్రభు కమలహాసన్కు జ్ఞాపికను అందించారు. అందులో ఆయన్ని ప్రశంసిస్తూ పేర్కొన్నారు. దాన్ని నటుడు ప్రభు చదివి వినిపించారు.
పసందైన విందు
జ్ఞాపికను అందుకున్న నటుడు కమలహాసన్ అందులో ప్రశంసలకు కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా ఆయన ఆ ఫొటోలను తన ట్విట్టర్లో పోస్టు చేశారు. ఎప్పటిలానే అన్నై ఇల్లత్తిల్ (శివాజీగణేశన్ ఇల్లు)లో ఎప్పటిలాగే పసందైన విందును ప్రేమాభిమానాలను కలిపి ఇచ్చారు. తమ్ముడు ప్రభు తన గురించి జ్ఞాపికలో రాసిన ప్రశంసలు తనను కంటతడి పెట్టించాయి అని పేర్కొన్నారు.