చెన్నైలో శ్రీదేవి సంవత్సరీకం
పెరంబూరు (చెన్నై): దివంగత నటి శ్రీదేవి తొలి స్మారక దిన కార్యక్రమం చెన్నైలో గురువారం జరిగింది. ‘అతిలోక సుందరి’ శ్రీదేవి గతేడాది ఫిబ్రవరి 24న దుబాయ్లో అకస్మాత్తుగా మరణించిన విషయం తెలిసిందే. మరో 10 రోజులకు శ్రీదేవి మరణించి ఏడాది పూర్తి అవుతుంది. అయితే తిథి ప్రకారం గురువారానికి (14వ తేదీ) ఏడాది అయ్యింది. దీంతో ఆమె భర్త బోనీకపూర్, ఆయన సోదరుడు అనిల్ కపూర్, కూతుళ్లు జాన్వి, ఖుషీ గురువారం చెన్నైకి చేరుకుని.. శ్రీదేవి ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తమిళ నటుడు అజిత్, ఆయన భార్య శాలిని పాల్గొన్నారు.
శ్రీదేవి నటించిన ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమా తమిళ వెర్షన్లో అజిత్ అతిథి పాత్రలో నటించారు. అప్పటి నుంచి రెండు కుటుంబాల మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. అజిత్తో ఒక సినిమా నిర్మించాలని శ్రీదేవి అనుకున్నారని ఒక ఇంటర్వ్యూలో బోనీకపూర్ వెల్లడించారు. సరైన కథ దొరక్కపోవడంతో సినిమా తీయలేకపోయినట్టు చెప్పారు. హిందీలో హిట్టయిన పింక్ సినిమాను తమిళంలో తీయాలని తనకు అజిత్ సూచించారని చెప్పారు.
సంబంధిత వార్తలు