
ముంబై : ప్రపంచ మాజీ సుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ కంటతడి పెట్టారు. ముంబైలో ఓ ఈవెంట్లో పాల్గొన్న ఐశ్వర్య, జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో చాలా ఉద్వేగానికి గురయ్యారు. జాతీయ గీతం పాడుతూనే, ఎంతో గర్వకారకంగా ఫీలై కంటతడి పెట్టేశారు. జాతీయ గీతం ఆలపన చివరిలో ఉబికి వస్తున్న తన కన్నీళ్లను ఎవరూ చూడకుండా తుడుచుకున్నారు. కానీ అప్పటికే ఐష్ పెట్టిన కన్నీళ్లు మీడియా కంట పడ్డాయి.
ఐశ్వర్య కంటతడి పెట్టిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబైలో ఐసీఎం ఉమెన్ ఈవెంట్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐశ్వర్య రాయ్ మాట్లాడుతూ... ఆధునిక కాల మహిళలకు, అభివృద్ధి చెందుతున్న పారిశ్రామికవేత్తలకు ప్రాతినిధ్యం వహించేలా తనను ప్రధాన అతిథిగా ఆహ్వానించడం చాలా గర్వకారకంగా ఫీలవుతున్నట్టు తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తలను గుర్తించడానికి అత్యంత ప్రతిష్టాత్మక వేదికల్లో ఐసీఎం ఉమెన్ ఒకటి. ఈ ఈవెంట్లో షబానా అజ్మి, సోను నిగమ్, జుహి చావ్లా, రోనిత్ రాయ్లు కూడా పాల్గొన్నారు.
