మినీ బాహుబలి చేశాం

Actor Bellamkonda Srinivas Special Chit Chat On Sakshyam Movie - Sakshi

‘‘జయ జానకి నాయక’ సినిమాకి ముందే శ్రీవాస్‌గారు ‘సాక్ష్యం’ కథ చెప్పారు. పంచభూతాల నేపథ్యంలో అద్భుతమైన కథ రెడీ చేశారాయన. ఇప్పటివరకూ చూడని సరికొత్త కథ.. చాలా బాగుంటుంది. పర్సనల్‌గా నాకు బాగా నచ్చింది’’ అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ అన్నారు. శ్రీవాస్‌ దర్శకత్వంలో బెల్లకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘సాక్ష్యం’. అభిషేక్‌ నామా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా సాయి శ్రీనివాస్‌ పంచుకున్న విశేషాలు...

► పంచభూతాలే ఈ జగతికి సాక్ష్యం. కర్మ సిద్ధాంతం నేపథ్యంలో వస్తున్న చిత్రం ‘సాక్ష్యం’.  భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకూ ఇలాంటి కథతో సినిమా రాలేదు. బహుశా.. మా సినిమా విడుదల తర్వాత ఈ జానర్‌లో మరిన్ని సినిమాలు వస్తాయనుకుంటున్నా. ఈ సినిమా కోసం 150 రోజులు పనిచేశాం.

► పాటలు, ఫైట్లు చక్కగా కుదిరాయి. యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌ ఉన్నాయి. నా బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు పీటర్‌ హెయిన్స్‌గారు యాక్షన్స్‌ డిజైన్‌ చేశారు. ఈ చిత్రంలో డూప్‌ లేకుండా రిస్కీ ఫైట్స్‌ చేశా. ఎంత కష్టపడితే అంత మంచి భవిష్యత్‌ ఉంటుందని నా నమ్మకం. అందుకే జెన్యూన్‌గా కష్టపడ్డా. వెరీ హ్యాపీ. యాక్షన్‌ సీక్వెన్స్‌ చాలా సహజంగా ఉంటాయి.

► ఇది పక్కా కమర్షియల్‌ సినిమా. ఇందులో నేను వీడియోగేమ్‌ డిజైనర్‌గా చేశా. ‘సాక్ష్యం’ కథ వినగానే హిట్‌ అని తెలుసు. సూపర్‌ హిట్‌ చేయాలని యూనిట్‌ అంతా చాలా కష్టపడ్డాం. ఓ రకంగా మినీ ‘బాహుబలి’ చేశాం. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ చూడదగ్గ చిత్రమిది.

► ఏ సినిమాకైనా నా వైపు నుంచి బెస్ట్‌ ఇవ్వడానికి కృషి చేస్తా. మినిమం గ్యారంటీ సినిమాలు ఇస్తాడనే పేరు చాలు. నా మార్కెట్‌ పరిధికి మించి ఎవరూ ఖర్చు పెట్టరు. వసూళ్లు ఒక్కటే కాదు.. శాటిలైట్‌ రైట్స్, థియేట్రికల్‌ రైట్స్‌ అన్నీ కలిపితే నా సినిమాలకు నష్టం రాదు. బడ్జెట్‌ విషయంలో  ఎవర్నీ ఒత్తిడి చేయను. నేనెప్పుడూ నిర్మాతల హీరోనే.

► ‘సాక్ష్యం’ వర్క్‌ని ప్రతిరోజూ ఎంజాయ్‌ చేస్తున్నా అని శ్రీవాస్‌గారు అన్నారు. మంచి విజన్‌తో ఈ కథ రెడీ చేశారు. రెండు పార్ట్‌లుగా తీయాల్సిన సినిమా ఇది. నా లైఫ్‌లో ‘సాక్ష్యం’ చిత్రాన్ని గర్వంగా ఫీలవుతా అని అభిషేక్‌ నామాగారు అన్నారు.

► కొత్త డైరెక్టర్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో పోలీసాఫీసర్‌ పాత్ర చేస్తున్నా. ఇందులో కాజల్‌ హీరోయిన్‌. 70శాతం షూటింగ్‌ పూర్తయింది. నవంబర్‌లో ఈ సినిమా రిలీజ్‌ అవుతుంది. తేజగారి డైరెక్షన్‌లో చేస్తున్న సినిమా తొలి షెడ్యూల్‌ ముగిసింది. ఇది చాలా కొత్త కథ. ఫస్టాఫ్‌లో ఫైట్స్‌ ఉండవు. ఏడేళ్ల కిందటే ఆయన ఈ కథ తయారు చేసుకున్నారు. ఈ సినిమాలో కూడా కాజలే హీరోయిన్‌. యాక్చువల్లీ ఈ సినిమాకు నాకన్నా ముందే కాజల్‌ని ఫైనలైజ్‌ చేశారు. తర్వాత నేను వచ్చా. మా కాంబినేషన్‌ రెండోసారి అనుకోకుండా కుదిరింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top