‘హింస’ గుట్టు విప్పే ట్విటర్
నిరసనల సమయంలో సామాజిక మాధ్యమాల్లో పోస్టుల ద్వారా అంచనా..
లాస్ఏంజెలెస్: నిరసనలు హింసాత్మకంగా మారుతాయా లేదా అనే విషయాన్ని ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లోని పోస్టులను బట్టి అంచనా వేయొచ్చని ఓ పరిశోధనలో తేలింది. నిరసన వ్యక్తం చేస్తున్న అంశంపై ఎక్కువగా నీతులు పోస్ట్ చేసినా.. వేరే వారు అదే అంశంపై సామాజిక మాధ్యమంలో నీతులు చెబుతున్నట్లు భావించినా కూడా హింసాత్మకంగా మారే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ‘సామాజిక మాధ్యమాల ప్రభావంతో తీవ్ర పరిణామాలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇటీవల ఇలాంటివి చాలా జరిగాయి.
అమెరికాలోని బాల్టిమోర్, చార్లెట్స్విల్లే ప్రాంతా ల్లో జరిగిన నిరసనలపై సామాజిక మాధ్య మాల్లోని పోస్టుల ప్రభావం ఎంతగానో ఉంది’అని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సద రన్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకుడు మోర్టెజా డెహగని వివరించారు. నీతిమంతమైన భాషను గుర్తించేందుకు తాము న్యూరల్ నెట్వర్క్ అనే సాంకేతికతను వినియోగించి, 2015లో పోలీస్ కస్టడీలో గ్రే అనే వ్యక్తి మృతిచెందిన నేపథ్యంలో బాల్టిమోర్ నిరసనల సందర్భంగా 1.8 కోట్ల ట్వీట్లను పరిశీలించగా ఈ విషయాన్ని నిర్ధారించినట్లు తెలిపారు.
అరెస్టులు, నీతిమంతమైన పోస్టులు, హింసాత్మక ఘటనలకు మధ్య సంబంధాన్ని పరిశీలించినట్లు చెప్పారు. పైగా నిరసనకారులకు పోలీసులకు మధ్య ఘర్షణలు చెలరేగినప్పుడు నీతిమంతమైన పోస్టులు రెట్టింపు అవుతున్నాయని, తద్వారా నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఈ పరిణామాలు క్రియాత్మకం అవుతున్నట్లు వివరించారు.