ప్రశాంతంగా తన పని తాను చేసుకుపోతున్న తరుణంలో కలిగిన చిన్న అవాంతరం అతనికి మండి.
సాక్షి, వాషింగ్టన్ : ప్రశాంతంగా వార్తలు చదువుతున్న సమయంలో చిన్న అలజడి. తన ఇయర్ ఫోన్లో గుసగుసలు వినిపించటంతో మండిపోయిన యాంకర్కి కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకునిపోయింది. అసలేం జరుగుతోంది... అంటూ మొదలుపెట్టిన 8 నిమిషాల తిట్ల దండకం వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
ఎంఎస్ఎన్బీసీ చానల్ లో 'లాస్ట్ వర్డ్' అనే కార్యక్రమానికి యాంకర్ అయిన లారెన్స్ ఓ డొన్నెల్ ఆగష్టు 28న బులిటెన్ సందర్భంగా చేసిన పని తెగ వైరల్ అవుతోంది. కంట్రోల్ రూమ్లో కూర్చున్న వాళ్లెవరో కంట్రోల్ తప్పిపోయారు. మీ సుత్తి మూలంగా వార్తలు ప్రశాంతంగా చదవలేకపోతున్నాను అంటూ రాయటానికి కూడా వీలులేని భాషలో బూతులు తిట్టారు. తన కోపం తగ్గేదాకా కమర్షియల్ బ్రేక్ కొనసాగించాలని అరిచాడు. మైక్ లో ఎవరో అమ్మాయి ఈ షో తరువాత ఏం చేద్దామంటూ కబుర్లు చెబుతోందని, ఆమె కావాలంటే ఇప్పుడే ఆ పని చేసుకోవచ్చని సూచించాడు.
'మీడియేట్' ఈ వీడియోను వెలుగులోకి తీసుకురాగా.. ఆ వీడియో వైరల్ కావడంతో లారెన్స్ తన క్షమాపణలు కోరాడు. సాంకేతిక సమస్యలు వేధించినందుకే తాను అలా ప్రవర్తించానని, అందుకు క్షమాపణలు కోరుతున్నానంటూ ట్విట్టర్లో ఓ ట్వీట్ చేశాడు.