తాలిబన్ల చెరలో 58 మంది సైనికులు
హీరత్: అఫ్గానిస్తాన్ అంతర్యుద్ధంలో భద్రతా బలగాలపై తాలిబన్లదే పైచేయిగా మారుతోంది. అఫ్గాన్–తుర్కిమెనిస్థాన్ సరిహద్దుల్లో జరుగుతున్న పోరులో తాలిబన్లు సుమారు 58 మంది సైనికులను బందీలుగా పట్టుకున్నారు. పదుల సంఖ్యలో సైనికులు భయంతో తుర్కిమెనిస్తాన్ భూభాగంలోకి పారిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. బద్ఘిస్ ప్రావిన్స్లోని బలమార్ఘాబ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుందని రక్షణ శాఖ తెలిపింది. వారిని విడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామంది. సరిహద్దు ఆవలికి వెళ్లిన సైనికులు తిరిగి వచ్చి విధుల్లో చేరారని తెలిపింది. అయితే, 72 మంది సైనికులు తమకు చిక్కినట్లు తాలిబన్లు ప్రకటించుకున్నారు. అంతర్యుద్ధాన్ని ముగించేందుకుగాను అమెరికా ఒక వైపు తాలిబన్లతో చర్చలు కొనసాగిస్తుండగానే ఈ పరిణామం సంభవించడం గమనార్హం.
సంబంధిత వార్తలు