శ్రీలంక పోలీస్‌ చీఫ్‌పై వేటు | Sri Lanka suspends police chief over Easter attacks | Sakshi
Sakshi News home page

శ్రీలంక పోలీస్‌ చీఫ్‌పై వేటు

Apr 30 2019 3:43 AM | Updated on Apr 30 2019 5:21 AM

Sri Lanka suspends police chief over Easter attacks - Sakshi

కొలంబో: శ్రీలంకలో ఈస్టర్‌ పండుగ రోజు జరిగిన బాంబు పేలుళ్లకు సంబంధించి ముందుగానే నిఘా సమాచారం ఉన్నప్పటికీ సరైన భద్రతా చర్యలు తీసుకోలేకపోయినందుకు పోలీస్‌ చీఫ్‌ పూజిత్‌ జయసుందరను అధ్యక్షుడు సిరిసేన సోమవారం సస్పెండ్‌ చేశారు. జయసుందర రాజీనామా చేస్తానని ప్రకటించినప్పటికీ చేయలేదు. దీంతో సిరిసేన ఆయనను సస్పెండ్‌ చేశారు. సీనియర్‌ డెప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా ఉన్న విక్రమరత్నేను తాత్కాలికంగా పోలీస్‌ చీఫ్‌గా, మాజీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఇళంగకూన్‌ను రక్షణ శాఖ కార్యదర్శిగా నియమిస్తున్నట్లు సిరిసేన ప్రకటించారు.

బాంబు పేలుళ్లకు నేతృత్వం వహించినట్లుగా భావిస్తున్న జహ్రాన్‌ హషీమ్‌ కుటుంబంలో 18 మంది కనిపించకుడా పోయారనీ, వారంతా చనిపోయుంటారని తనకు భయంగా ఉందని జహ్రాన్‌ సోదరి మహ్మద్‌ హషీమ్‌ మథానియా చెప్పారు. బాంబు పేలుళ్లు జరిగిన రోజు రాత్రి నుంచి తమ కుటుంబంలో ఐదుగురు కనిపించకుండా పోయారనీ, వారిలో తన తండ్రి, ముగ్గురు తన సోదరులు, మరొకరు తన సోదరి భర్త ఉన్నారని ఆమె తెలిపారు. మళ్లీ శుక్రవారం రాత్రి సైందమరుదు పట్టణంలో పోలీసులు, అనుమానిత ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఆరుగురు చిన్నారులు సహా 10 మంది చనిపోయారని అధికారులు చెప్పారు.

ముసుగుపై నిషేధం అమల్లోకి
ఈస్టర్‌ బాంబు పేలుళ్ల నేపథ్యంలో శ్రీలంకలో ముస్లిం మహిళలెవరూ బహిరంగ ప్రదేశాల్లో మొహానికి ముసుగులు ధరించకుండా తీసుకొచ్చిన నిషేధం  అమల్లోకి వచ్చింది. ముఖం కనిపించకుండా ఎలాంటి ముసుగులూ ధరించకూడదని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement