
‘మా బంధం ఇప్పటిది కాదు.. వందేళ్లపైనే..’
దేశ ఆర్థికాభివృద్ధిలో నెదర్లాండ్ తమకు సహజమైన భాగస్వామి అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. నెదర్లాండ్ తమకు అతిపెద్ద వ్యాపార భాగస్వామి అని చెప్పారు.
ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై చర్చించుకున్న తర్వాత సామాజిక భద్రత, వాటర్ కోపరేషన్, సంస్కృతి సహకారంవంటి అంశాలకు సంబంధించిన అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. అనంతరం జరిగిన ఉమ్మడి మీడియా సమావేశంలో వాతవరణంలో మార్పు అంశంలో గతంలో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని ఇరువురు స్పష్టం చేశారు. పునర్వినియోగ శక్తులను అభివృద్ధి చేసుకునేందుకు పరస్పరం సహకారం చేసుకుంటామని అన్నారు. మిసైల్ టెక్నాలజీకి కంట్రోల్ రెజిమ్(ఎంటీసీఆర్)లో సభ్యత్వం కోరిన భారత్కు మద్దతిచ్చినందుకు మోదీ ధన్యవాదాలు తెలిపారు.
‘మీ మద్దతుతోనే ఎంటీసీఆర్లో సభ్యత్వం పొందాము. అందుకు ధన్యవాదాలు’అని మోదీ అన్నారు. గత ఏడాదే భారత్ ఎంటీసీఆర్లో పూర్తిస్థాయి సభ్యత్వాన్ని పొందిన విషయం తెలిసిందే. భారత్, నెదర్లాండ్ దేశాల మధ్య సంబంధాలు ఇప్పటివి కావని, ఎంతోకాలం నుంచి ఉన్నవని, చాలా బలమైనవని మోదీ ఈ సందర్భంగా చెప్పారు. అనంతరం నెదర్లాండ్ ప్రధాని రట్టే మాట్లాడుతూ ‘భారత్ ప్రపంచశక్తిగా అవతరిస్తోంది. అటు రాజకీయంగా ఆర్థికంగా ఎదగడాన్ని స్వాగతిస్తున్నాం. సమన్యాయపాలనను, భద్రతను మేం కలిసి పంచుకుంటాం’ అని చెప్పారు. మోదీ ప్రారంభించిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలైన క్లీన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాను కొనియాడారు. భారత్ తన లక్ష్యాలు చేరుకునేందుకు తమ దేశం అన్ని రకాలుగా సహకరిస్తుందని స్పష్టం చేశారు.