హింసాత్మకంగా మారిన ఇరాన్ అల్లర్లు
13 మంది మృతి
అధ్యక్షుడి హెచ్చరికలను పట్టించుకోని ఆందోళనకారులు
టెహరాన్: ఇరాన్లో తాజాగా మళ్లీ అల్లర్లు చెలరేగాయి. ఇస్ఫహాన్ రాజధాని క్వాడెరిజన్ సోమవారం రాత్రి జరిగిన అల్లర్లలో 13 మంది మరణించారు. సాయుధులైన కొందరు ఆందోళనకారులు సైనిక శిబిరాలు, పోలీస్స్టేషన్లపై దాడికి దిగడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. ఈ ఘటనతో ఇప్పటివరకూ చనిపోయినవారి సంఖ్య 21కి చేరుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రదర్శనలను నిరోధించేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం లేకుండాపోతోంది. కాగా, 2009 తర్వాత మళ్లీ ఇప్పుడు ఇరాన్లో పెద్ద ఎత్తున్న అల్లర్లు చెలరేగుతున్నాయి.
ఆర్థిక వ్యవస్థను దిగజారుస్తూ ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తుందంటూ ప్రభుత్వంపై ఆరోపణలు రావడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. కొంతమంది ప్రభుత్వం గద్దెదిగి పోవాలంటూ నిరసన ప్రదర్శనలకు పిలుపునివ్వగా.. సోషల్మీడియాలో అది విపరీతంగా చక్కర్లు కొట్టింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో భద్రతా బలగాలను మోహరించింది. ఇలాఉంచితే 2013లో అధికారంలోకి వచ్చిన రౌహాని...ఆర్ధిక వ్యవస్థను తీర్చిదిద్దుతానని, సామాజిక సంఘర్షణలు తగ్గుముఖం పట్టేలా చేస్తానని అప్పట్లో హామీ ఇచ్చారు. అయితే ఒకవైపు ప్రజల జీవన వ్యయంతోపాటు నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిపోయింది. ఇదే దేశంలో అశాంతికి కారణమైంది.
450 మంది అరెస్టు
ఇలాఉంచితే గడచిన మూడురోజుల వ్యవధిలో ఇరాన్ ప్రభుత్వం 450 మందిని అరెస్టు చేసింది. రాజధానిలో అల్లర్లకు పాల్పడేవారి విషయంలో జోక్యం చేసుకోవాల్పిందిగా రెవల్యూషనరీ గార్డులను అదుపులోకి తీసుకొచ్చింది.
మరిన్ని వార్తలు