భారత్‌లో పత్రికా స్వేచ్ఛ దారుణం | India drops down on World Press Freedom Index | Sakshi
Sakshi News home page

భారత్‌లో పత్రికా స్వేచ్ఛ దారుణం

Apr 19 2019 4:00 AM | Updated on Apr 19 2019 5:25 AM

India drops down on World Press Freedom Index - Sakshi

లండన్‌: పత్రికా స్వేచ్ఛలో భారత్‌ తాజాగా మరో రెండు స్థానాలు దిగజారి 140వ ర్యాంకుకు పరిమితమైంది. పారిస్‌ కేంద్రంగా పనిచేసే రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌ (ఆర్‌ఎస్‌ఎఫ్‌) అనే స్వచ్ఛంద సంస్థ 2019 ఏడాదికి పత్రికా స్వేచ్ఛ అంశంలో 180 దేశాలకు ర్యాంకులు కేటాయించింది. ‘ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీ – 2019’ పేరిట ఓ నివేదికను సంస్థ గురువారం విడుదల చేసింది. ఎన్నికల సమయం కావడంతో పాత్రికేయుల మీద అధికార బీజేపీ నేతల దాడులు పెరిగిపోయాయని సంస్థ ఈ నివేదికలో పేర్కొంది. భారత్‌లో గతేడాది జర్నలిస్టులపై జరిగిన హింసాత్మక దాడుల్లో ఆరుగురు చనిపోయారనీ, ఏడవ జర్నలిస్టు మృతి అంశంలోనూ అనేక అనుమానాలు ఉన్నాయంది. ‘భారత్‌లో పాత్రికేయులపై పోలీసులు, మావోయిస్టులు, నేర ముఠాలు, అవినీతి రాజకీయ నాయకులు హింసాత్మక దాడులకు పాల్పడటం, వారిని బెదిరించటం వంటివి చేస్తున్నారు.

ఇలాంటి దాడుల వల్ల గతేడాది ఆరుగురు జర్నలిస్టులు చనిపోయారు’ అని నివేదిక తెలిపింది. ఆంగ్లేతర భాషల మీడియాకు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయంది. 2018లో భారత్‌కు 138వ ర్యాంకు దక్కగా తాజాగా 140వ స్థానానికి చేరింది. ఇక 2019 ఏడాదికి ప్రపంచ పత్రికా స్వేచ్ఛలో నార్వే మూడోసారి తొలి ర్యాంకు పొందింది. ఫిన్లాండ్, స్వీడన్, నెదర్లాండ్స్‌ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. భారత్‌కు పొరుగు దేశాలైన పాకిస్తాన్‌ 142వ ర్యాంకు, బంగ్లాదేశ్‌ 150వ ర్యాంకు పొందాయి. సూచీ చిట్టచివరన తుర్క్‌మెనిస్తాన్‌ (180వ ర్యాంకు), ఉత్తర కొరియా (179), చైనా (177), వియత్నా (176) ఉన్నాయి. ఆఫ్రికా దేశాలైన ఇథియోపియా 110వ ర్యాంకును, గాంబియా 92వ ర్యాంకును పొందాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement