Dawood Ibrahim Dead With Corona? | కరోనాతో దావూద్‌ ఇబ్రహీం మృతి..! - Sakshi Telugu
Sakshi News home page

కరోనాతో దావూద్‌ ఇబ్రహీం మృతి..!

Jun 6 2020 3:26 PM | Updated on Jun 6 2020 3:35 PM

Dawood Ibrahim Dead With Corona News Viral In Social Media - Sakshi

ఇస్లామాబాద్‌ : మోస్ట్‌ వాటెండ్‌ అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం కరోనా వైరస్‌తో మృతి చెందాడన్న వార్తలు సోషల్‌ మీడియాలో షికారు చేస్తున్నాయి. 1994 నుంచి పాకిస్తాన్‌లోని కరాచీలో ఐఎస్‌ఐ ఆశ్రయంలో ఉంటున్న దావూద్‌, అతడి భార్య మెహజబీన్‌ కరోనా బారిన పడి కరాచీ మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని శుక్రవారం నుంచి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కరోనా బారిన పడి ఆయన మృతి చెందాడని పాకిస్తాన్‌కు చెందిన న్యూస్‌ ఎక్స్‌ మీడియా సంస్థ శనివారం ఓ కథనాన్ని ప్రచురించింది. వైరస్‌ సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దావూద్‌ మృతి చెందాడని పేర్కొంది. ఈ వార్త కాస్తా సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌‌ అవుతోంది. (దావూద్ ఇబ్రహీంకు కరోనా పాజిటివ్..‌!)

అయితే దావూద్‌ మృతిపై సరైన సమాచారం లేకపోయినా.. వార్తలు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు విపరీతంగా కామెంట్స్‌ పెడుతున్నారు. భారత్‌తో సహా ప్రపంచ దేశాలు చేయలేని పనిని కరోనా వైరస్‌ చేసిందని వ్యంగ్యంగా పోస్ట్‌ చేస్తున్నారు. కాగా వందలాది మంది ప్రాణాలను బలిగొన్న 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో దావూద్‌ ఇబ్రహీం ప్రధాని నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దాదాపు 25 ఏళ్ల నుంచి బయటి ప్రపంచానికి కనిపించకుండా రహస్య ప్రదేశాల్లో తలదాచుకుంటున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement