పరిహారం ఎంతో ఇప్పుడే చెప్పలేం: ట్రంప్‌ | Sakshi
Sakshi News home page

పరిహారం ఎంతో ఇప్పుడే చెప్పలేం: ట్రంప్‌

Published Tue, Apr 28 2020 10:50 AM

Coronavirus US Doing Serious Investigation Against China Says Trump - Sakshi

వాషింగ్టన్‌: చైనాలోని వుహాన్‌లో పుట్టుకొచ్చిన కరోనా మహమ్మారితో సంభవించిన నష్టాలకు పరిహారం కోరే విషయమై సిద్ధమవుతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. వైరస్‌ పుట్టికొచ్చిన తొలినాళ్లలో చైనా పారదర్శకంగా వ్యవహరించలేదని ఆరోపించారు. డ్రాగన్‌ దేశం విధానాలు సరిగా లేవని వైట్‌హౌజ్‌లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. వైరస్‌ బయటిపడిన చోటునుంచే త్వరితగత నిర్ణయాలతో అదుపు చేస్తే.. పరిస్థితులు ఇంత దారుణంగా తయారయ్యేవి కావని, ప్రపంచం మొత్తానికి కరోనా వ్యాప్తి జరగక పోయేదని వెల్లడించారు.
(చదవండి: మీటింగ్‌ జరుగుతుంటే ఇదేం పని..)

కాగా, చైనా కారణంగా తమ దేశం ఆర్థికంగా నష్టపోయిందని పేర్కొంటూ.. 165 బిలియన్‌ డాలర్లు నష్టపరిహారం కోరేందుకు జర్మనీ సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే, జర్మనీ కంటే భారీ మొత్తాన్ని చైనా నుంచి పరిహారం కోరతామని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. చైనా దేశ నాయకులను బాధ్యులుగా చేసేందుకు ఎన్నో మార్గాలున్నాయని తెలిపారు. దానికోసం ‘అమెరికా సీరియస్‌ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది‌’ అని పేర్కొన్నారు. ‘మేం జర్మనీ కంటే ఇంకా సులభ మార్గాన్ని ఎంచుకుంటాం. కోవిడ్‌తో చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు పతనమయ్యాయి. అందుకే భారీ మొత్తాన్ని రాబట్టే దిశగా ముందుకెళతాం. ఎంత మొత్తం అని ఇప్పుడే చెప్పలేం. భారీ స్థాయిలోనే ఉంటుంది ’అని ట్రంప్‌ వాఖ్యానించారు. ఇక గత డిసెంబర్‌లో వుహాన్‌లో పుట్టుకొచ్చిన ప్రాణాంతక కోవిడ్‌-19 తో ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మంది బాధితులుగా మారగా.. 2 లక్షల మంది ప్రాణాలు విడిచారు. అమెరికాలోనే 55,000 మరణాలు సంభవించాయి. ప్రపంచ దేశాలు కరోనా లాక్‌డౌన్‌తో ఆర్థికంగా కుదేలయ్యాయి.
(చదవండి: బ్రిటన్‌ చిన్నారుల్లో కొత్త లక్షణాలు)

Advertisement
Advertisement