
మాతృత్వపు సెలవుపై వెళ్లిన నర్సులపై నిమ్స్ వేటు!
మాతృత్వపు సెలవులపై వెళ్లి తిరిగి బాధ్యతలు స్వీకరించడానికి వచ్చిన నర్సులపై నిమ్స్ యంత్రాంగం వేటు వేసింది.
కాంట్రాక్టు ఉద్యోగినులకు అన్యాయం
సాక్షి, హైదరాబాద్: మాతృత్వపు సెలవులపై వెళ్లి తిరిగి బాధ్యతలు స్వీకరించడానికి వచ్చిన నర్సులపై నిమ్స్ యంత్రాంగం వేటు వేసింది. వారిని ఉద్యోగంలో నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైనప్పటికీ మాతృత్వపు సెలవులు తీసుకోవడానికి వారు అర్హులే. 15మంది నర్సులను తప్పిస్తూ నిమ్స్ యాజమాన్యం నిర్ణయం తీసుకుందని బాధితులు తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డికి ఈ విషయాన్ని విన్నవించామని.. న్యాయం చేస్తానని హామీ ఇచ్చినా.. ఆయన మాటకు విలువనివ్వకుండా నిమ్స్ యాజమాన్యం తమను తొలగించిందని ఆరోపించారు.
మాతృత్వపు సెలవులు ముగియక ముందే కొందరు చేరడానికి వచ్చారని.. అయినా తొలగించడం అన్యాయమన్నారు. నిమ్స్ నిర్వహించిన రాత పరీక్షలో తాము ప్రతిభతో నెగ్గి కాంట్రాక్టు ఉద్యోగం సంపాదించామని.. అర్థంతరంగా విధుల్లోంచి తొలగిస్తే.. మేం బతికేదెలా? అని వారు ఆవేదన చెందారు. నిమ్స్లో కొందరు డబ్బులు తీసుకొని కొత్తవారిని నియమించడానికే.. తమను ఇలా ఆకస్మికంగా తొలగించారని, తమకు న్యాయం చేయాలని వారు కోరారు.