77 లక్షల మందికి ఎంఆర్‌ టీకా | Sakshi
Sakshi News home page

77 లక్షల మందికి ఎంఆర్‌ టీకా

Published Wed, Sep 13 2017 3:04 AM

MR vaccine for 77 lakh people

సాక్షి, హైదరాబాద్‌: తట్టు(మీజిల్స్‌), రుబెల్లా వ్యాధుల నిర్మూలన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ఎంఆర్‌ టీకా కార్యక్రమం విజయవంతంగా అమలవుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే 86 శాతం మంది పిల్లలకు టీకాలు వేశారు. ఎంఆర్‌ టీకా కార్యక్రమం ఆగస్టు 17న మొదలైంది. తొమ్మిది నెలలు నిండిన, 15 ఏళ్లలోపు ఉన్న పిల్లలందరికీ ఈ టీకాలు వేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 90,01,117 మంది టీకా వేయాల్సిన పిల్లలు ఉన్నట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గుర్తించింది. సెప్టెంబర్‌ 12 వరకు రాష్ట్రంలోని 77,21,477 మంది పిల్లలకు టీకాలు వేయడం పూర్తయింది. ఈ నెల 25 వరకు ఎంఆర్‌ టీకా వేసే కార్యక్రమం అమలు కానుంది.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎంఆర్‌ టీకా కార్యక్రమం విజయవంతంగా అమలవుతోంది. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల నిర్లక్ష్య వైఖరితో గ్రేటర్‌ హైదరాబాద్‌లో తొలుత ఈ కార్యక్రమం సక్రమంగా సాగలేదు. అనంతరం వైద్య శాఖ చేపట్టిన చర్యలతో పురోగతి వచ్చింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 72 శాతం మంది పిల్లలకు ఎంఆర్‌ టీకా వేసినట్లు ఆరోగ్య శాఖ తాజా నివేదిక పేర్కొంది. ఎంఆర్‌ టీకా అమలులో ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌ జిల్లాలు అగ్రస్థానంలో ఉన్నాయి.

Advertisement
 
Advertisement